సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు, వినూత్న కార్యక్రమాల సమాహారంగా రాష్ర్ట స్థాయి యువజనోత్సవాలు శనివారం నుంచి మాదాపూర్లోని శిల్పారామంలో కనువిందు చేయనున్నాయి.
మాదాపూర్, న్యూస్లైన్: సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు, వినూత్న కార్యక్రమాల సమాహారంగా రాష్ర్ట స్థాయి యువజనోత్సవాలు శనివారం నుంచి మాదాపూర్లోని శిల్పారామంలో కనువిందు చేయనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాలను రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖామంత్రి వట్టి వసంతకుమార్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 23 జిల్లాల్లో నిర్వహించిన ఉత్సవాల్లో ప్రతిభ కనబర్చిన కళాకారులను రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలకు ఎంపిక చేశారు. ఆయా ప్రదర్శనల్లో ఎంపికయిన వారిని పంజాబ్ లూథియానాలో జనవరి 12న జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవాలకు పంపిస్తారు.
శిల్పారామంలో జానపద సంగీతం, జానపద నృత్యాలు, శాస్త్రీయ సంగీతం (కర్నాటక, హిందుస్తానీ), శాస్త్రీయ వాయిద్యాలు (తబలా, వీణా, మృదంగం, హార్మోనియం, సితారా, వేణువు), శాస్త్రీయ నృత్యాలు (కూచిపూడి, భరతనాట్యం, మణిపూరి, కథక్, ఒడిస్సీ) తదితరాల్ని నిర్వహించనున్నారు. మిమిక్రీ, వెంట్రిలాక్విజమ్, మ్యాజిక్, ఏకపాత్రాభిన యం, ఫ్యాన్సీడ్రెస్, క్విజ్, వ్యాసరచన, పెయింటింగ్, వక్తృత్వం, గీతం, నృత్యం, సామూహిక చర్చ, మార్షల్ ఆర్ట్స్ తదితర ప్రత్యేక ప్రదర్శన, కార్యక్రమాలు కూడా అలరించనున్నాయి.
అదేవిధంగా మోహన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేత్రదానం, అవయవదానంపై అవగాహన కల్పించడానికి ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 29న లఘు చిత్రాన్ని ప్రదర్శిస్తారు. 30న జరిగే ముగింపు వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె.మహంతి ముఖ్యఅతిథిగా విచ్చేస్తారని యువజన సర్వీసుల శాఖ నిర్దేశకుడు కర్రి రాజభౌమ హరినారాయణ చక్రవర్తి తెలిపారు.