భార్యను సుత్తితో మోది చంపిన భర్త | Husband killing his wife with a hammer | Sakshi
Sakshi News home page

భార్యను సుత్తితో మోది చంపిన భర్త

Apr 29 2016 2:21 AM | Updated on Nov 6 2018 7:56 PM

భార్యను సుత్తితో మోది చంపిన భర్త - Sakshi

భార్యను సుత్తితో మోది చంపిన భర్త

తలపై సుత్తితో మోది భార్యను అతికిరాతకంగా హత్య చేశాడో దుర్మార్గుడు. అనంతరం ఇద్దరు పిల్లల తో కలసి ...

 ఆత్మహత్య చేసుకుంటానని కూతుళ్లతో పరార్
 
ముషీరాబాద్: తలపై సుత్తితో మోది భార్యను అతికిరాతకంగా హత్య చేశాడో దుర్మార్గుడు. అనంతరం ఇద్దరు పిల్లల తో కలసి ఆత్మహత్య చేసుకుంటానని లేఖ రాసి ఇంటి నుంచి పరారయ్యాడు. ముషీరాబాద్ ఠాణా పరిధిలో గురువారం ఈ ఘోరం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ముషీరాబాద్ డివిజన్ పఠాన్‌బస్తీలో నివసించే మహ్మద్ షబ్బీర్ అహ్మద్(45), ఫర్హానాభాను(38) దంపతులకు కుమారుడు ఎండీ జాఫర్(18), కుమార్తెలు సోఫియానూర్(16), ఆయేషాసిమ్రాన్(14) సంతానం. షబ్బీర్ భోలక్‌పూర్ ఇందిరానగర్‌లో ఫ్లోర్ పాలిషింగ్ వ్యాపారం చేస్తున్నాడు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా కలిసి ఓ ఫంక్షన్‌కు వెళ్లి.. రాత్రి ఒంటి గంటకు ఇంటికి తిరిగి వచ్చారు.

కాగా, గురువారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో షబ్బీర్ భార్య ఫర్హానా భాను తలపై సుత్తితో మోది హత్య చేశాడు. అనంతరం   కుమార్తెలు సోఫియానూర్, ఆయేషాసిమ్రాన్‌లను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వెళ్లే ముందు అతను తన కుమారుడు జాఫర్ నుద్దేశించి హిందీలో లేఖ రాశాడు. అందులో  ‘‘భార్య అంటే తనకు ఇష్టమేనని, ఆర్థిక ఇబ్బందులు కారణం చంపేశానని, ఆత్మహత్య చేసుకొనేందుకు ఇద్దరు కుమార్తెలను తీసుకొని వెళ్లిపోతున్నానని, డబ్బు కోసం తన ఇంటికి ఎవ్వరూ రావడం ఇష్టం లేదని’’ రాశాడు. కాగా, ఉదయం 11 గంటలకు కుమారుడు జాఫర్ ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి.. తన తండ్రి, ఇద్దరు చెల్లెళ్లు కనిపించడం లేదని చెప్పాడు. 

నీ తల్లి ఎక్కడ అని పోలీసులు ప్రశ్నించగా... తండ్రి చంపేశాడని చెప్పాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాగా, భార్యను హత్య చేసి కుమార్తెలతో కలిసి ఆత్మహత్య చేసుకుంటానని వెళ్లిన షబ్బీర్ అహ్మద్ కోసం పోలీసులు రెండు ప్రత్యేక బృందాలతో ముమ్మరంగా గాలిస్తున్నారు.  ఆర్థిక ఇబ్బందులతో షబ్బీర్ భార్యను హత్య చేశాడా? ఇతర కారణాలున్నాయా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement