ఉద్యానశాఖలో పోస్టుల భర్తీకి బ్రేక్ పడింది. ఆ శాఖ ప్రతిపాదించిన ఖాళీల భర్తీ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్ తోసిపుచ్చినట్లు సమాచారం.
హైదరాబాద్: ఉద్యానశాఖలో పోస్టుల భర్తీకి బ్రేక్ పడింది. ఆ శాఖ ప్రతిపాదించిన ఖాళీల భర్తీ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్ తోసిపుచ్చినట్లు సమాచారం. ‘ఇప్పుడున్న వారితో సరిగా పనిచేయించుకోండి. వారిని పూర్తిస్థాయిలో ఉపయోగించుకున్నాక అవసరమైతే అప్పుడు చూద్దాం’ అని సీఎం పేర్కొన్నట్లు తెలిసింది. దీంతో ఉద్యానశాఖలో పోస్టుల భర్తీ జరుగుతుందని భావించిన నిరుద్యోగులకు నిరాశే ఎదురైంది. ఉద్యానశాఖను బలోపేతం చేయాలని ప్రభుత్వం భావించింది.
సర్కారు ఆదేశంతోనే ఉద్యానశాఖ కూడా పోస్టుల భర్తీపై ప్రతిపాదనలు పంపింది. వాస్తవంగా 521 పోస్టులు అవసరమని గతంలో ప్రతిపాదించింది. చివరకు 208 హెచ్ఈవో పోస్టులు నింపాలని సర్కారు ప్రాథమికంగా అంగీకరించింది. ఎందుకోగానీ సీఎం వాటిని తిరస్కరించినట్లు తెలియడంతో అధికారులు నిరాశకు లోనయ్యారు.