తొమ్మిది పద్దులకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన సవరణలను సభ తిరస్కరించింది.
సాక్షి, హైదరాబాద్: తొమ్మిది పద్దులకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. ఎమ్మెల్యేలు తీసుకొచ్చిన సవరణలను సభ తిరస్కరించింది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి గ్రాంట్ల కోసం రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, పౌర సరఫరాల నిర్వహణ, ఆబ్కారీ, వాణిజ్య పన్నులు, రవాణా, హోంశాఖ, వ్యవసాయం, పశు సంవర్ధనం, మత్స్య పరిశ్రమ, సహకార రంగాలకు చెందిన పద్దులకు ఆదివారం ఆమోదం లభించింది. బడ్జెట్ పద్దులపై చర్చలో భాగంగా హోం మంత్రి నాయిని మాట్లాడుతూ, హైదరాబాద్తో పాటు ముఖ్యపట్టణాల్లో ట్రాఫిక్ను నియంత్రించేందుకు ఫ్లైఓవర్లు, సిగ్నలింగ్ వ్యవస్థ ఏర్పాటుకు యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టనున్నట్లు చెప్పారు. పోలీసుల వారంతపు సెలవును త్వరలో అమలు చేస్తామన్నారు.
భూసార పరీక్షలకు ప్రత్యేక వాహనం: పోచారం
భూసార పరీక్షలు వేగవంతం చేసేందుకు ప్రత్యేక వాహనం సమకూర్చనున్నట్లు మంత్రి పోచారం శ్రీనివాస్రెడ్డి తెలిపారు. అలాగే పశువైద్యం కోసం కూడా 108 తరహాలో వాహనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.