సెక్యూరిటీ ఉన్నప్పటికీ రెచ్చిపోయిన దొంగలు జూలు విదిల్చారు. కాపలా దారులు, సీసీ కెమెరాలు ఉండే మూడు విల్లాల్లో చోరీలకు పాల్పడ్డారు.
కుత్బుల్లాపూర్: సెక్యూరిటీ ఉన్నప్పటికీ రెచ్చిపోయిన దొంగలు జూలు విదిల్చారు. కాపలా దారులు, సీసీ కెమెరాలు ఉండే మూడు విల్లాల్లో చోరీలకు పాల్పడ్డారు. రూ.1.5 లక్షల విలువ చేసే సొత్తును అపహరించుకుపోయారు. పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన వివరాలివీ.. దూలపల్లి గ్రామానికి ఆనుకుని ఉన్న ‘అశోక ఏ లా మైసన్’ లో విల్లాలు ఉన్నాయి. వాటిలో 39వ నంబరు విల్లాలో నిలోఫర్లో వైద్యులుగా పని చేస్తున్న భార్యాభర్తలు గీత, దశరథ్ ఉంటున్నారు. అయితే, బుధవారం ఉదయం లేచి చూసే సరికి ఇంట్లో ఉండాల్సిన హ్యాండ్ బ్యాగ్ ఇంటి బయట కనిపించింది. అందులో ఉన్న రూ.1.5 లక్షలు విలువ చేసే ఐదు తులాల బంగారు ఆభరణాలు, రూ.9వేల నగదు మాయమయ్యాయి.
కిటికీ గ్రిల్స్ తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు బ్యాగ్ ను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఇదే క్రమంలో పక్కనే ఉన్న 80, 82 నంబర్ల విల్లాల్లో సైతం దొంగలు చోరీకి యత్నించినట్లు వెల్లడైంది. అయితే, అక్కడ విలువైన వస్తువులేవీ దొరక్కలేదు. కప్ బోర్డ్లను తెరిచి, వస్తువులను చిందర వందరగా చేసి వెళ్లిపోయారు. బుధవారం మధ్యాహ్నం ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పటిష్టమైన సెక్యూరిటీ, సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగలు చోరీకి పాల్పడటం గమనార్హం.