వీవీపై అక్రమ కేసు విరమించుకోవాలి | Sakshi
Sakshi News home page

వీవీపై అక్రమ కేసు విరమించుకోవాలి

Published Wed, Jun 13 2018 12:59 AM

Virasam Demands For Withdraw Cash On Varavara Rao - Sakshi

డాక్టర్‌ వరవరరావు తెలుగు సాహిత్యంలో సుప్ర సిద్ధ రచయిత. అరవై ఏళ్ల నుంచి కవిగా, రచయి తగా, విమర్శకుడిగా, పరిశోధకుడిగా సాహిత్య కృషి చేస్తున్నారు. సముద్రం, చలినెగళ్లు, ఆ రోజులు లాంటి కవితా సంపుటాలను ప్రచురిం చారు. ‘తెలంగాణ విమోచనోద్యమ నవలల’పై విలువైన పరిశోధనను చేశారు. ఈ పరిశోధన వివిధ విశ్వవిద్యాలయాలలో రెఫరెన్స్‌గా ఉంది. ‘భూమి తో మాట్లాడు...’ లాంటి కల్పనా సాహి త్యంపై విమర్శ గ్రంథాలను రాశారు. వరంగల్‌ లోని సి.కె.ఎం. కళాశాలలో సుదీర్ఘ కాలం తెలుగు అధ్యాపకులుగా, కళాశాల ప్రిన్సిపల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. కవిగా, రచయితగా, వక్తగా, ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాహిత్య విశ్లే షకుడిగా ఆయనకు దేశవ్యాపిత గుర్తింపు ఉంది. తెలుగు సమాజంలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పడం కోసం ఆయన నక్సలైట్లకు, ప్రభు త్వానికి మధ్య జరిగిన చర్చలలో ప్రతినిధిగా పాల్గొని తన బాధ్యతను నిర్వహించారు.

వరవరరావు 1970లో ఏర్పడిన విప్లవ రచ యితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు. ప్రజాకవి శ్రీశ్రీ, కాళోజీలతో కలిసి పనిచేశారు. ఆయన నమ్మిన విలువల కోసం, సిద్ధాంత రాజకీయాల కోసం అరవై ఏళ్లుగా రాజీ లేకుండా పనిచేస్తు న్నారు. ఇట్లాంటి వ్యక్తులు మన సమాజంలో ఉండటం సామాజిక చలనానికి అదనపు కూర్పు. భిన్న భావాలు కలిగి ఉండటమనే ప్రజాస్వామిక సూత్రానికి ఆయన లాంటి వాళ్లు ఒక ఉదాహరణ. భారత సమాజం మొదటి నుంచి అన్ని ఆలో చనలకు నిలయంగా ఉంది. వరవరరావు విప్లవా చరణ సాహిత్యంలోనే కానీ ఇతరేతర రూపాలలో కాదని మేము నమ్ముతున్నాం. విప్లవ పార్టీల చర్యలతో ఆయనకు సంబంధం ఉండే అవకాశం లేదు. రచయిత స్వేచ్ఛగా తన భావాలను వ్యక్తం చేసే అవకాశం ఉన్నప్పుడే సృజనాత్మక సాహిత్యం వికసిస్తుంది. భావాలను ఆధారంగా చెబుతున్న లేఖలో వరవరరావు ప్రస్తావనను ఆధారం చేసు కుని రచయితను వేధించడం సరైంది కాదు కనుక మహారాష్ట్ర పోలీసులు అక్రమ కేసులో ఆయనను ఇరికించే ప్రయత్నాన్ని విరమించుకోవాలని మేము విజ్ఞప్తిచేస్తున్నాము. వరవరరావుపై అక్రమ కేసును మోపే ప్రయత్నాన్ని విరమించుకోవాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.

(నిఖిలేశ్వర్, నందిని సిధారెడ్డి, పొత్తూరి వెంకటేశ్వరరావు, కె.రామచంద్రమూర్తి, కె.శ్రీని వాస్, గద్దర్, అంపశయ్య నవీన్, పాశం యాద గిరి, ఓల్గా, విమలక్క, దేవిప్రియ, యాకూబ్, కాత్యా యని విద్మహే, గోరటి వెంకన్న, సురెపల్లి సుజాత, విల్సన్‌ సుధాకర్, కొండేపూడి నిర్మల, జయధీర్‌ తిరుమలరావు. నగ్నముని, కె.శివారెడ్డి, ఖాదర్‌ మొహినుద్దిన్‌ తదితర 35 మంది రచయితలు, కవులు, కళాకారులు) 

Advertisement

తప్పక చదవండి

Advertisement