ప్రారంభం | Sakshi
Sakshi News home page

ప్రారంభం

Published Sun, Mar 4 2018 8:20 AM

Special story on funday - Sakshi

‘ప్రేతాత్మ’ పత్రికా కార్యాలయం! ఎడిటర్‌ ఎదురుగా కూర్చొని ఉన్నాడు క్షుద్రేంద్ర. ప్రముఖ క్షుద్ర రచయిత అతడు. అతడెలా ఉంటాడో ఒక్కసారైనా చూడాలని పాఠకులే కాదు, పత్రికా సిబ్బంది కూడా కుతూహల పడుతుంటారు. అయితే ఆ అదృష్టం ఒక్క ‘ప్రేతాత్మ’ ఎడిటర్‌కి మాత్రమే దక్కింది!పదిహేనేళ్లుగా ఆ పత్రిక వస్తోంది. ప్రారంభం నుంచీ అందులో వారం వారం క్షుద్రేంద్ర కథ వస్తోంది. అది దెయ్యం కథ. బాగా పాపులర్‌. అసలు ప్రారంభ సంచిక మార్కెట్‌లోకి వచ్చినప్పుడే.. ‘రచయితను ఒకసారి చూడాలని ఉంది’ అని పత్రికా కార్యాలయానికి పుర్రెలకొద్దీ ఉత్తరాలు, ఎముకలకొద్దీ ఈమెయిళ్లు వచ్చాయి. ఆ తొక్కిడిని తట్టుకోలేక నాలుగో వారంలోనే చిన్న నోట్‌ పెట్టాడు ఎడిటర్‌..‘చితి కాలుతున్నప్పుడు కపాలమోక్షం జరిగినట్లుగా, కథ చదువుతున్నప్పుడే రచయిత మీకు పైకి లేస్తూ కనిపిస్తాడు చూడండి’ అని!

‘ప్రేతాత్మ’ ఎడిటర్‌ పాఠకులకు పెట్టే గమనికలన్నీ ఇలాగే గమ్మతుగా ఉంటాయి. ఎడిటర్‌ తనదైన శైలిలో ఎన్ని గమనికలు పెట్టినా, పాఠకలోకం మాత్రం క్షుద్రేంద్రను చూపించమని ఏళ్లుగా అడుగుతూనే ఉంది.‘‘అలా చూపించలేం కానీ, కావాలంటే రచయితతో ‘ప్రశ్నలు–జవాబులు’ శీర్షికను పెట్టించగలను అని పాఠకులకు మరో గమనిక రాశాడు ఎడిటర్‌. ఆ శీర్షికకు ఆయన పెట్టిన పేరు.. ‘దెయ్యంతో క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌ దానిక్కూడా పుర్రెలకొద్ది ఉత్తరాలు, ఎముకలకొద్దీ ఈమెయిళ్లు! పాఠకుల ప్రశ్నలకు క్షుద్రేంద్ర ఇచ్చే సమాధానాలు ఆయన కథల్ని మించి పాపులర్‌ అయ్యాయి!‘ఈ కథలు, కుకుంబర్లు కాదు కానీ, నాకు నిజంగా దెయ్యాన్ని చూడాలని ఉంది. చూపించగలరా?’ అని వర్థని అనే ధైర్యస్థురాలు వెంకటాపురం ఎస్టేట్‌ నుంచి ఉత్తరం రాసింది.  

‘దెయ్యాన్ని చూసే ధైర్యం మనకు మాత్రమే ఉంటే సరిపోదు, మనల్ని చూసే ధైర్యం దెయ్యానికి కూడా ఉండాలి. అప్పుడు మాత్రమే మనం దెయ్యాన్ని చూడగలం’ అని క్షుద్రేంద్ర జవాబు రాశాడు. ‘దెయ్యాల కథల్ని రాసి సమాజానికి మీరేం సందేశం ఇవ్వదలచుకున్నారు?’.. ఇంకో ప్రశ్న. ‘దెయ్యాల కథలతో పాటు మనుషుల కథలూ పత్రికల్లో వస్తున్నాయి కదా. మనుషుల కథల్ని రాసి సమాజానికి మీరేం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు అని దెయ్యాలు ఏనాడైనా మనల్ని అడిగాయా?!’.. క్షుద్రేంద్ర జవాబు. ఇలా సాగేది.. ‘దెయ్యంతో క్యాండిల్‌ లైట్‌ డిన్నర్‌l‘‘ఈవారం నుంచి మీ రెమ్యునరేషన్‌ని పెంచుతున్నాం క్షుద్రేంద్ర గారూ..’’ అన్నాడు ఎడిటర్‌. క్షుద్రేంద్ర నవ్వాడు. ఆ వారానికి ఇవ్వవలసిన కథ అతడి చేతిలో ఉంది. దాన్ని ఎడిటర్‌ టేబుల్‌ మీద పెట్టాడు.

క్షుద్రేంద్ర కథను పోస్ట్‌ చెయ్యడు. మెయిల్‌ చెయ్యడు. నేరుగా వచ్చి, ఎడిటర్‌ని కలిసి, ఎడిటర్‌కే ఆ కథ కాగితాలు ఇచ్చి వెళతాడు. అవి కంపోజ్‌ అయి ఉండవు. చేతి రాతతో ఉంటాయి. అవి జెరాక్సులు కూడా కాదు. ఒరిజినల్‌. ఇలా రాసి, అలా తెచ్చిస్తాడు. అది కూడా డెడ్‌లైన్‌ మించిపోకుండా! కథ ఎంత గొప్పగా ఉన్నా, కథని టైమ్‌కి తెచ్చివ్వడమే గొప్పగా అనిపిస్తుంది ఎడిటర్‌కి ప్రతిసారీ.  ఈ పదిహేనేళ్లలో ఏ ఒక్క వారం కూడా.. ‘కథ అయిందా?అని క్షుద్రేంద్రకు ఎడిటర్‌ నుంచి ఫోన్‌ వెళ్లలేదు.క్షుద్రేంద్ర తెచ్చిన కథను ఇష్టంగా చేతుల్లోకి తీసుకున్నాడు ఎడిటర్‌.

మీ కథ మా పత్రిక్కి ఎంతో ఇచ్చింది క్షుద్రేంద్ర గారూ. మా పత్రికే మీకు తగినంతగా ఇవ్వలేకపోయింది. రెమ్యునరేషన్‌ పెంచడంతోపాటు, మీకొక గౌరవ సన్మానం కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం’’ అన్నాడు. ఆ మాట నిజం. క్షుద్రేంద్ర తనకు తెలియకుండానే పత్రిక్కి చాలా ఇచ్చాడు. వారం వారం ‘ప్రేతాత్మ’ మార్కెట్‌లోకి రాగానే, పాఠకులు ముందుగా వెదికేది క్షుద్రేంద్ర రాసే దెయ్యం కథ కోసమే. ఆ కథను చదివితే దెయ్యాలంటే భయపడేవాళ్లకు దెయ్యాల భుజం మీద చెయ్యి వేసి నడవాలనిపిస్తుంది. దెయ్యాలను నమ్మనివాళ్లకు నిజంగానే దెయ్యాలు ఉండి ఉంటే ఈ లోకం ఎంత అందంగా ఉండేదో కదా అనిపిస్తుంది. క్షుద్రేంద్ర నవ్వాడు. ‘‘పాఠకుల మనసుల్లో సుస్థిరస్థానం సంపాదించుకోవడం కన్నా సన్మానం ఏముంటుంది చెప్పండి ఒక రచయితకి’’ అన్నాడు.

కావచ్చనుకోండి. మిమ్మల్ని సన్మానించుకోవడం పత్రిక్కి గౌరవం’’ అన్నాడు ఎడిటర్‌.  నేనూ మీలో ఒకడినే అనుకోండి. ఎవర్ని వారు గౌరవించుకోవడం బాగోదు కదా. నవ్వాడు క్షుద్రేంద్ర. ఆ మాట నిజం. మీరూ మాలో ఒకరే’’ అన్నాడు ఎడిటర్‌. నమస్తే పెట్టి, పైకి లేచాడు క్షుద్రేంద్ర. క్షుద్రేంద్ర అలా వెళ్లగానే, ఇలా ఎడిటర్‌ క్యాబిన్‌లోకి వచ్చాడు కథల విభాగం హెడ్డు.

రండి.. శర్మా.. కూర్చోండి అన్నాడు ఎడిటర్‌.
ఈవారం ఏం చేద్దాం సార్‌ అన్నాడు శర్మ.
ఏంటి.. చేయడం?’’
అదే సర్, క్షుద్రేంద్రగారి కథ..అంటూ ఆగాడు.
ఓ! అదా.. వస్తుందిలే అన్నాడు ఎడిటర్‌ నవ్వుతూ.. క్షుద్రేంద్ర తనకు కథ ఇచ్చిన విషయాన్ని చెప్పకుండా.
అది కాదు సర్‌. క్షుద్రేంద్రగారు పోయారట అన్నాడు శర్మ.
వ్వాట్‌!!అదిరిపడ్డాడు ఎడిటర్‌.
అవున్సార్‌. ఈ తెల్లవారుజామునట. హార్ట్‌ ఎటాక్‌. మీకు తెలుసనుకున్నాను అన్నాడు శర్మ.
తె..ల్ల..వా..రు..జా..ము..నా?!!
సగం తెరిచి ఉన్న సొరుగు వైపు చూశాడు. అంతక్రితమే క్షుద్రేంద్ర ఇచ్చి వెళ్లిన కథ కాగితాలు కనిపిస్తున్నాయక్కడ.

ఆ వారం ప్రేతాత్మ’ సంచిక మార్కెట్‌లోకి వచ్చింది కానీ, అందులో క్షుద్రేంద్ర కథ లేదు. ఎప్పుడూ ఆయన కథ ఉండే పేజీ మొత్తం తెల్లగా ఉంది! ఆ తెల్లటి పేజీ మధ్యలో చిన్న అక్షరాల్లో రెండే రెండు వాక్యాలు.  
పదిహేనేళ్ల నాటి క్షుద్రేంద్ర కథలు మళ్లీ ప్రారంభం. వచ్చేవారం నుంచే ఆ అక్షరాలను ఎడిటర్‌ వేళ్లు ఆత్మీయంగా నిమిరాయి. సొరుగులోని ఆ చివరికథ’ను మాత్రం తెరిచి చూడలేదు ఎడిటర్‌. తన పత్రికలో ఎప్పటికీ క్షుద్రేంద్ర మాత్రమే ఉండాలి. క్షుద్రేంద్ర చివరి కథ ఉండకూడదు అనుకున్నాడు ఆయన.

మాధవ్‌ శింగరాజు

Advertisement
Advertisement