
స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి
విజయాలను ప్రసాదించే విజయవాడ కనకదుర్గాదేవి ఆలయంలో ప్రతియేడూ ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద అంటే పాడ్యమినుండి...
విజయాలను ప్రసాదించే విజయవాడ కనకదుర్గాదేవి ఆలయంలో ప్రతియేడూ ఆశ్వయుజ శుద్ధ ప్రతిపద అంటే పాడ్యమినుండి విజయదశమి వరకు వైభవంగా శ్రీ దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు నిర్వహించటం ఆనవాయితీ. ఈ సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారి అలంకార విశేషాలు, పఠించవలసిన శ్లోకం, చేయవలసిన నివేదన, చేయడం వల్ల కలిగే ఫలాలు సాక్షి ఫ్యామిలీ పాఠకులకోసం రోజూ ప్రత్యేకంగా...
మొదటిరోజు - స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి
శ్రీదేవీ శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా మొదటిరోజు శనివారం అమ్మవారు శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి (శైలపుత్రి)గా దర్శనమిస్తుంది. అమ్మవారిని బంగారు కవచాలతో, ఎరుపురంగు చీరతో అలంకరిస్తారు.
నివేదన: ఆవునేతితో చేసిన పొంగలి
ఈరోజు పఠించవలసిన శ్లోకం
సౌమ్యాని యాని రూపాణి త్రైలోక్యే విచరంతితే!
యాని చాత్యుర్థ ఘోరాణి తై ర్మాస్మాంస్తథా భువమ్
భావం: ఓ జననీ! ముల్లోకాలయందు సంచరిస్తుండే నీ సాత్త్విక రూపాలతో మిక్కిలి భయంకరమైన స్వరూపాలతో మమ్మల్ని, ఈ సమస్త భూమండలాన్ని కాపాడు!
ఫలమ్: ఇంటిలో ఉన్న చిక్కులు తొలగి, శక్తి, సంపదలు కలుగుతాయి.
- దేశపతి అనంత శర్మ, పురోహితులు