బంగారు తెలంగాణ సాధిస్తాం | will achieve Bangaru telangana soon | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణ సాధిస్తాం

Apr 9 2014 3:51 AM | Updated on Aug 11 2018 7:11 PM

అమరవీరుల త్యాగాల వల్ల ఏర్పడిన రాష్ట్రాన్ని ‘బంగారు తెలంగాణ’గా మారుస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రతిజ్ఞ చేశారు.

గన్‌పార్క్‌వద్ద టీ కాంగ్రెస్ నేతల ప్రతిజ్ఞ
 సాక్షి, హైదరాబాద్: అమరవీరుల త్యాగాల వల్ల ఏర్పడిన రాష్ట్రాన్ని ‘బంగారు తెలంగాణ’గా మారుస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ప్రతిజ్ఞ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో పార్టీ టికెట్లు దక్కిన నేతలంతా మంగళవారం గన్‌పార్క్ వద్దకు వచ్చి అమరవీరులకు నివాళులు అర్పించారు. ‘సాధిస్తాం.. సాధిస్తాం.. పసిడి తెలంగాణ సాధిస్తాం..’ అని నినాదాలు చేశారు. అక్కడికి వచ్చిన అభ్యర్థులందరితో ఈ మేరకు పొన్నాల ప్రమాణం చేయించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ల ఎంపికలో సామాజిక న్యాయం పాటించామని, బీసీలకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు. గెలుపే ప్రధాన గీటురాయిగా అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు.
 
వంద అసెంబ్లీ, 15 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానిక నేతల ఒత్తిడి వల్ల టికెట్ల ఎంపికలో జేఏసీ నాయకులకు సంపూర్ణ న్యాయం చేయలేకపోయామన్నారు. పార్టీలో వర్గపోరు ఉన్నప్పటికీ ఎన్నికల్లో సమష్టిగా పనిచేస్తే కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తామని స్పష్టంచేశారు. కేంద్ర మంత్రి బలరాంనాయక్, మాజీ మంత్రులు జానారెడ్డి, గీతారెడ్డి, ఎంపీలు గుత్తా సుఖేందర్‌రెడ్డి సహా పలువురు అభ్యర్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తాము కచ్చితంగా గెలుస్తామని.. తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న వినయ్‌కుమార్, భార్గవ్ దేశ్‌పాండే, ఒబేదుల్లా కొత్వాల్, సామకృష్ణారెడ్డి తదితరులు ధీమా వ్యక్తంచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement