సైకిల్కు ఓటేస్తే.. ఉరేసుకున్నట్లే: లోకేష్

సైకిల్కు ఓటేస్తే.. ఉరేసుకున్నట్లే: లోకేష్ - Sakshi


తెలుగుదేశం పార్టీ నాయకులు ఒక్కొక్కరికీ మాటలు తడబడుతున్నాయి. అతి ఆవేశానికి పోయి ఏం చెబుతున్నామో కూడా మర్చిపోతున్నారు. 'సైకిల్ గుర్తుకు ఓటేస్తే.. మనకు మనం ఉరేసుకున్నట్లే' అని స్వయంగా పార్టీ యువ నాయకుడు, అధినేత కుమారుడు నారా లోకేష్ బాబు.. అలియాస్ ట్విట్టర్ బాబు చెప్పాడు. మైకు పట్టుకుని వీరావేశంతో ప్రసంగిస్తూ తెలుగు తమ్ముళ్లందరికీ ఈ విషయాన్ని డప్పుకొట్టి చెప్పాడు. అంతేకాదు, మరో సందర్భంలో ఇదే ట్విట్టర్ బాబు.. ''మతపిచ్చి, కులపిచ్చి, అవినీతి, బంధుప్రీతి.. ఇవన్నీ ఉన్న పార్టీ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది ఒక్క తెలుగుదేశం పార్టీయే. అవునా, కాదా?" అంటూ తిరుపతిలో కార్యకర్తలను అడిగాడు.



కొడుకు ఇలా చెబుతుంటే తాను మాత్రం తక్కువ తిన్నానా అంటూ.. చంద్రబాబు కూడా ఇదే స్థాయిలో గందరగోళానికి గురయ్యారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అభ్యర్థి విషయంలో తీవ్ర గందరగోళానికి లోనయ్యారు. వేదికపై ఉన్నది బీజేపీ అభ్యర్ధా, టీడీపీ అభ్యర్ధా అనే విషయం కూడా తెలియకుండా, వీర్రాజుకు ఓటు వేయాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. దీంతో అక్కడ పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాణిక్యాలరావుకు చుక్కలు కనిపించాయి. వెంటనే తేరుకుని చంద్రబాబుకు విషయం తెలియజెప్పారు.



అంతకుముందు లోకేష్కు పిల్లనిచ్చిన మామ, మేనమామ బాలకృష్ణ సైతం ఆవేశంలో వీరిద్దరికీ ఏమాత్రం తగ్గలేదు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమేనని ఘంటాపథంగా శ్రీకాకుళంలో వాకృచ్చారు. అది విన్న కార్యకర్తలు ఒక్కసారిగా అయోమయానికి గురయ్యారు.



ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా అన్నట్లు.. అగ్రనాయకులే ఇలా ఉంటే ఇక నియోజకవర్గ స్థాయి నాయకులు తాము కూడా అలాగే ఉంటామంటున్నారు. తొలుత కాంగ్రెస్ నుంచి జై సమైక్యాంధ్ర పార్టీలోకి వెళ్లి, అక్కడినుంచి టీడీపీలోకి మారిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఇటీవల ఏలూరులో టీడీపీ కార్యాలయానికి వచ్చారు.  జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ అత్యధిక సంఖ్యలో గెలుచుకుంటుంది అంటూ అందరికీ చెప్పసాగారు. ఇంతలో పక్కవాళ్లు అందించడంతో.. 'కాంగ్రెస్ అనేశానా.. పొరపాటు అయిపోయింది' అంటూ నాలుక కరుచుకున్నారు.

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top