మీ ఓటుతో రాజన్న రాజ్యం: వైఎస్ జగన్


ఎన్నికల ప్రచారం ముగింపు సభల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు

బాబు మోడీ కోసం ఓటడుగుతున్నారు..  నేను తెలుగుజాతి భవిష్యత్తు కోసం ఓటడుగుతున్నాను

రూ. 1.27 లక్షల కోట్ల రైతు రుణ మాఫీ అంటూ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోన్న చంద్రబాబును నిలదీయండి

ఈ ఎన్నికల్లో విశ్వసనీయత కలిగిన నాయకుడినే సీఎంగా ఎన్నుకోండి

సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఐదు సంతకాలు, ఆరు పనులతో రాష్ట్ర దశ, దిశ మారుస్తా.. చెప్పినవే కాదు.. చెప్పనివీ చేస్తా


 సాక్షి ప్రతినిధి, కర్నూలు/అనంతపురం: ‘‘మరో రెండు రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మన తలరాతలు మార్చే ఆ ఎన్నికల్లో ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించండి.. ఏ నాయకుడైతే ప్రతి పేదవాడి గుండెచప్పుడు వింటాడో.. ఏ నాయకుడైతే నిరుపేదల మనసెరిగి ప్రవర్తిస్తాడో.. ఏ నాయకుడైతే చని పోయినా పేదవాడి గుండెల్లో సజీవంగా బతికి ఉండగలడో అలాంటి నాయకుడినే ముఖ్యమంత్రిని చేయండి. అధికారం కోసం పచ్చి అబద్ధాలు చెప్పే.. ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చే చంద్రబాబును తరిమితరిమి కొట్టండి.. మీకు నేను చేసే విజ్ఞాపన ఒక్కటే. విశ్వసనీయతకు ఓటేయండి.. వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణయుగాన్ని మళ్లీ తెచ్చుకుం దాం..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి రోజు సోమవారం ఆయన కర్నూలు జిల్లా కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లా మడకశిర, హిందూపురంలో రోడ్ షో నిర్వహించి ‘వైఎస్సార్ జనభేరి’ సభల్లో ప్రసంగించారు. జగన్ ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..

 

 ఓట్లు, సీట్ల కోసం రాష్ట్రాన్ని విడగొట్టారు..

 దివంగత ప్రియతమ నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ముందు ఎందరో ముఖ్యమంత్రులు పనిచేశారు. ఆ  నేత వెళ్లిపోయిన తర్వాత ఎందరో ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ.. ఇప్పటికీ కూడా వైఎస్ ఎక్కడ ఉన్నా రు అంటే ప్రజలు నేరుగా కుడిచేతిని తమ గుండెలవైపు తీసుకెళ్లి.. మా గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి సజీవంగా ఉన్నారని చెబుతున్నారు. రాజశేఖరరెడ్డి నుంచి వారసత్వంగా నాకు ఏమైనా వచ్చిందంటే అది ఒక్క విశ్వసనీయతే. వైఎస్ వెళ్లిపోయాక ఈ వ్యవస్థ చెడిపోయింది. కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసం ఒక మనిషిని లేకుండా చేయాలనుకున్నారు, ఒక పార్టీని లేకుండా చేయాలనుకున్నారు, ఒక మనిషిని జైలుకు పంపారు, రాష్ట్రాన్ని చీల్చడానికీ వెనుకాడలేదు.

 

 చంద్రబాబూ ఆ తొమ్మిదేళ్లూ ఎందుకు చేయలేదు?

 చంద్రబాబు తొమ్మిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన హయాంలో ఏ ఒక్క వర్గానికీ మేలు చేసిన పాపాన పోలేదు. కానీ.. ఇప్పుడు అధికారం కోసం అది ఫ్రీగా ఇస్తా.. ఇది ఫ్రీగా ఇస్తా అంటూ మీ ముందుకొస్తున్నాడు. ఇప్పుడు ఫ్రీగా ఇస్తానని చెబుతోన్న హామీల్లో ఏ ఒక్కటైనా తొమ్మిదేళ్ల పాలనలో ఎందుకు అమలు చేయలేకపోయావు అంటూ చంద్రబాబును గట్టిగా నిలదీయండి. నీ భయానక పాలనలో అధిక ఫీజులు చెల్లించలేక.. చదువుకోవడానికి అవస్థలు పడుతున్న విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకునేందుకు ఏ ఒక్క రోజైనా ఆ విద్యార్థుల దగ్గరకు వెళ్లి మాట్లాడావా?కేన్సర్, గుండెపోటు, ప్రమాదాలకు గురైన వారు మెరుగైన చికిత్సలు చేయించుకోవాలంటే రూ.2 నుంచి రూ.3 లక్షలు వెచ్చించా ల్సి వస్తే.. ఆ పేద ప్రజలు ఆ మొత్తాన్ని రూ.3 నుంచి రూ.5 వడ్డీకి అప్పులు తెచ్చి చికిత్స చేయించుకున్న దుస్థితిపై ఏనాడైనా ఆరా తీశావా చంద్రబాబూ..? తొమ్మిదేళ్లలో రైతుల రుణమాఫీ గుర్తుకు రాలేదా? ఉచిత విద్యుత్ గుర్తుకురాలేదా? ఆ తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని సింగపూర్, మలేసియాలా ఎందుకు చేయలేదు? ఓట్ల కోసం, సీట్ల కోసం ఇప్పుడు అవన్నీ గుర్తుకొచ్చాయా? అని చంద్రబాబును నిలదీయండి.

 

 రుణ మాఫీపై చంద్రబాబువి పచ్చి అబద్ధాలు..

 రుణమాఫీ.. ఇంటికో ఉద్యోగం అంటూ చంద్రబాబు కపట వాగ్దానాలు చేస్తున్నారు. రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ రూ.1.27లక్షల కోట్ల రుణాలున్నాయని నిర్ధారిస్తే.. చంద్రబాబు మనుషులు టీవీల వద్దకు వెళ్లి ఒకాయన రూ.20 వేల కోట్లు, మరొకరు రూ.30 వేల కోట్లు, ఇంకొకరు రూ.10 వేల కోట్లని చెబుతున్నారు. అంటే రూ. 1.27 లక్షల కోట్లున్న రైతు రుణాలను వీళ్లంతట వీళ్లే, అది అమలు కాకముందే తక్కువ చేసి చూపిస్తున్నారంటే.. వీళ్ల చిత్తశుద్ధి ఏమిటో ఇప్పుడే అర్థమవుతోంది.

  చంద్రబాబు చెబుతున్న రైతు రుణ మాఫీకి రూ.1.27 లక్షల కోట్లు, డ్వాక్రా రుణ మాఫీకి రూ.20 వేల కోట్లు కలిపి రూ.1.5 లక్షల కోట్లు ఖర్చవుతుంది. మన రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.1.25 లక్షల కోట్లయితే రూ.1.5 లక్షల కోట్ల రుణాలను ఈయనెలా మాఫీ చేస్తాడని అడుగుతున్నా. అంతేకాదు, రాష్ట్రంలో 3.5 కోట్ల ఇళ్లుంటే చంద్రబాబు ఇంటికో ఉద్యోగం ఇస్తానని అబద్ధమాడుతున్నాడు. రాష్ట్రంలో అన్నీ కలిపి 20 లక్షల ఉద్యోగాలే ఉంటే.. చంద్రబాబు మాత్రం 3.5 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్నప్పుడు 65 ప్రభుత్వ సంస్థలను మూయించి 26వేల మందిని నడిరోడ్డున నిలబెట్టిన ఘనుడు చంద్రబాబు. ఎన్నికల సమయంలో ఒక మాట, అయ్యాక మరో మాట మాట్లాడటం బాబుకు అలవాటే.’’

 

 హిందూపురంలో ఎన్నికల ఆఖరి సభ

 సోమవారం కర్నూలు జిల్లాలోని కర్నూలు, నంద్యాలలో రోడ్ షో నిర్వహించి అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొన్న జగన్.. అక్కడి నుంచి అనంతపురం జిల్లాలోని మడకశిర, హిందూపురం, తాడిపత్రి నియోజకవర్గాల్లో పర్యటించాలని భావించారు. తాడిపత్రిలో ఎన్నికల ప్రచారాన్ని ముగించాలనుకున్నారు. కానీ కర్నూలు జిల్లా నుంచి హెలికాప్టర్ ద్వారా నేరుగా మడకశిరకు వచ్చి ప్రచారం ముగిసిన వెంటనే హెలికాప్టర్‌లో హిందూపురం బయలుదేరేందుకు ప్రయత్నించారు. కానీ.. హెలీకాప్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడటంతో మడకశిర నుంచి హిందూపురానికి రోడ్డు మార్గంలో వెళ్లారు. హిందూపురంలో సభ ముగిసే సరికే సాయంత్రం ఆరు గంటలైంది. ఎన్నికల నిబంధనల మేరకు ప్రచార గడు వు పూర్తవడంతో తాడిపత్రి సభను రద్దు చేసుకున్నారు.

 

 ఢిల్లీ మెడలు వంచే ప్రభుత్వం కావాలా.. సాగిలపడే సర్కారు కావాలా?

 సోనియా గాంధీ రాష్ట్రాన్ని విడగొడుతుంటే.. పార్లమెంటులో పూర్తిగా మద్దతిచ్చిన నరేంద్ర మోడీ, చంద్రబాబు.. ఓట్లు, సీట్ల కోసం ఏ గడ్డి అయినా తింటారు. వీళ్లెవరికీ మన మీద, మన రాష్ట్రం మీద ప్రేమ లేదు. వీళ్లకు కావాల్సిందల్లా ఓట్లు, సీట్లే. చంద్రబాబు నరేంద్ర మోడీకి ఓటేయాలని అడుగుతున్నారు. నేను తెలుగుజాతి భవిష్యత్తు కోసం ఓటేయాలని అడుగుతున్నాను.

 

 మనకు ఢిల్లీ మెడలు వంచే ప్రభుత్వం కావాలా? ఢిల్లీకి సాగిలపడే ప్రభుత్వం కావాలా? మీరే నిర్ణయించుకోండి. 25 ఎంపీ సీట్లు మనకున్నాయి. తెలుగుజాతి భవిష్యత్తు కోసం వాటన్నింటినీ మనమే గెలుచుకుందాం. ఆ తర్వాత మోడీని ప్రధానిని చేద్దామా.. ఎల్లయ్యను చేద్దామా.. పుల్లయ్యను చేద్దామా అన్నది ఆ రోజు ఆలోచిద్దాం. ఎవరైతే మన రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తారని మనకు నమ్మకం కలుగుతుందో అలాంటి వ్యక్తినే ప్రధానిని చేద్దాం.

 - వైఎస్ జగన్

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top