
‘పోరు’ ఫలితాలపై.. పందేల హోరు
క్రికెట్ బెట్టింగ్ నుంచి రాజకీయ బెట్టింగ్ వరకు ఉభయగోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కొనసాగుతోంది.
హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల సమరం ముగిసింది. నరాలు తెగే ఉత్కంఠతో జరిగిన పోరులో ఓటర్లు ఇచ్చిన తీర్పు ‘ఈవీఎం’లలో భద్రంగా ఉంది. వారి తీర్పు ఏమిటి, తమ అదృష్టం ఎలా ఉండబోతోంది అన్న ఆదుర్దాతో అభ్యర్థుల కంటికి కునుకు దూరమవుతోంది. అదే సమయంలో పందేలరాయుళ్లు అదే తీర్పుపై తమ అదృష్టాన్నీ పరీక్షించుకుంటున్నారు. ‘కాయ్ రాజా కాయ్’ అంటూ జోరుగా పందేలు కాస్తున్నారు. రాజకీయ నాయకులు, కార్యకర్తలే కాదు..రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న పలువురు పందేల బరిలో ‘సై’ అంటున్నారు.
సాక్షి, కాకినాడ : క్రికెట్ బెట్టింగ్ నుంచి రాజకీయ బెట్టింగ్ వరకు ఉభయగోదావరి జిల్లాలు పెట్టింది పేరు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ కొనసాగుతోంది. ఈ పొట్టి క్రికెట్లో వందల కోట్లు ఇక్కడ చేతులు మారుతుంటాయి. ఈసారి క్రికెట్ కంటే ఎన్నికల బెట్టింగ్లే ఇక్కడ జోరుగా సాగుతున్నాయి. ముందెన్నడూ లేని రీతిలో స్థానిక ఎన్నికల నుంచి పార్లమెంటు పోరు వరకు వరుసగా జరిగాయి. గతనెలలో సెమీఫైనల్స్ స్థాయిలో జరిగిన మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలపై జిల్లాలో ఇప్పటికే వందల కోట్ల రూపాయల పందేలు జరిగాయి. ఇప్పుడు సార్వత్రిక సమరంలో గెలుపోటములపైనా జోరుగా పందాలు సాగుతున్నాయి. పోలింగ్ సరళిపై వారి వారి అంచనాలను బట్టి పందేలరాయుళ్లు పందేలకు శ్రీకారం చుట్టారు. బుధవారమే మొదలైన పందేలు గురువారం మరింత జోరందుకున్నాయి. ఫలితాల వెల్లడికి మరో 8 రోజులు గడువుండడంతో ఆనాటికి పందేలు మరింత ముమ్మరం అయ్యే అవకాశముంది.
‘ఫ్యాన్’ తుపాన్ వీచిందంటున్న సర్వేలు
రాష్ర్టవ్యాప్తంగా ‘ఫ్యాన్’ గాలి పెనుతుపానుగా వీచిందని పోలింగ్ సరళిని బట్టి ఇప్పటికే సర్వేలన్నీ ఘోషిస్తున్నాయి. జాతీయ, రాష్ర్టస్థాయి పత్రికలు, చానళ్లు, రాజకీయ విశ్లేషకులు సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ ఘన విజయం తథ్యమని అంచనా వేస్తుండగా.. రాజకీయ చైతన్యం కల్గిన గోదావరి జిల్లాల్లోనూ అదే ఒరవడి కొనసాగే అవకాశం పుష్కలంగా ఉండడంతో పందేలరాయుళ్లు ఎక్కువగా ఆ పార్టీతోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆరాటపడుతున్నారు. జిల్లాలో మూడు ఎంపీలతో పాటు 14 అసెంబ్లీ స్థానాలు కచ్చితంగా వైఎస్సార్ సీపీ ఖాతాలో జమ కానున్నాయని, మిగిలిన స్థానాల్లో కూడా ఆ పార్టీకే ఎక్కువగా మొగ్గుందని అంచనా వేస్తున్నారు. కాగా తెలుగుతమ్ముళ్లు సైతం.. తమ పార్టీ అధికారం లోకి వస్తుందని కానీ, ఫలానా నియోజకవర్గంలో తమ అభ్యర్థి గెలిచి తీరుతాడని కానీ పందెం కాసేందుకు సాహసించలేకపోతున్నారు.
హాట్ ఫేవరెట్గా బరిలో నిలిచిన వైఎస్సార్ సీపీ వైపు పందెం పట్టడానికే పలువురు ఉత్సాహపడుతున్నారు. రాష్ర్టంలో 15 నుంచి 20 ఎంపీ స్థానాలతో పాటు వందకు పైగా అసెంబ్లీ సీట్లు వైఎస్సార్ సీపీ గెలుచుకుంటుందని, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త ఆంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రి అవుతారని పందెం కాయడానికి ముందుకు వచ్చే వారి సంఖ్య జిల్లాలో ఎక్కువగా ఉంది. కొంతమంది మరో అడుగుముందుకేసి వైఎస్సార్ సీపీ 22కు పైగా ఎంపీ స్థానాలతో పాటు 130కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటుందని సైతం పందేలకు సై అంటున్నారు. పందేల కోసం కొందరు ఇళ్లు, పొలాలు, ఇతర ఆస్తులను పణంగా పెడుతున్నారు. మొత్తం మీద ఈనెల 16వ తేదీ.. పదవులు దక్కిన వారికీ, పందేలు గెలిచిన వారికీ పండగ కానుండగా.. ఎన్నికల పోరులో చతికిలబడిన వారికీ, పందేలు కోల్పోయిన వారికీ దుర్దినం కానుంది.
వైఎస్సార్ సీపీపై కోసు పందేలు..
జిలాలో మూడు పార్లమెంటు, 12 నుంచి 15 వరకు అసెంబ్లీ స్థానాలు వైఎస్సార్ సీపీ గెలుచుకుంటుందని పలువురు పందేలకు ముందుకు వస్తున్నారు. కాగా విజయం ఖాయమనుకుంటున్న అభ్యర్థులు సాధించే మెజారిటీలపైనా పందేలు జోరుగా సాగుతున్నాయి. వైఎస్సార్ సీపీ కాకినాడ, అమలాపురం ఎంపీ అభ్యర్థులు చలమలశెట్టి సునీల్, పినిపే విశ్వరూప్లతో పాటు జగ్గంపేట, తుని, ప్రత్తిపాడు, అనపర్తి, రాజమండ్రి రూరల్, రాజోలు, అమలాపురం, రంపచోడవరం, కాకినాడ సిటీ వంటి నియోజక వర్గాల్లో అభ్యర్థుల మెజారిటీలపై పందేలు జోరుగా సాగుతున్నాయి. కాకినాడ ఎంపీగా సునీల్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుపొందుతారని, అనపర్తిలో డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డికి పాతికవేలకు పైగా మెజారిటీ వస్తుందని, జగ్గంపేట, తునిలలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు 15 వేలకు తక్కువ కాకుండా మెజారిటీ వస్తుందంటూ పందేలు కాస్తున్నారు. పిఠాపురం, కాకినాడ రూరల్లలో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల స్థాయిలోనే స్వతంత్రులపై పందేలు కాస్తున్నారు. సామాజిక సమీకరణల్లో కీలక నియోజకవర్గాలైన కొత్తపేట, రామచంద్రపురం, మండపేటల్లో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో పందేలు జరుగుతున్నాయి. రామచంద్రపురం, మండపేటల్లో అయితే వైఎస్సార్ సీపీ తరఫున పందేలకు ముందుకు వచ్చే వారు ఒకటికి మూడింతలు ఇచ్చే విధంగా ‘కోసు’ పందేలు కాస్తున్నారు.