గిరి ఆవుల రవాణా చార్జీలు చెల్లిస్తాం
మక్కినవారిగూడెం (టి.నరసాపురం) : మక్కినవారిగూడెం ప్రాంతంలో రైతులు అవలంభిస్తున్న సేంద్రియ వ్యవసాయ పద్ధతులను జిల్లా అదనపు జేసీ ఎండీ షరీష్ గురువారం పరిశీలించారు.
మక్కినవారిగూడెం (టి.నరసాపురం) : మక్కినవారిగూడెం ప్రాంతంలో రైతులు అవలంభిస్తున్న సేంద్రియ వ్యవసాయ పద్ధతులను జిల్లా అదనపు జేసీ ఎండీ షరీష్ గురువారం పరిశీలించారు. గతంలో ఈ ప్రాంత రైతులు గుజరాత్ నుంచి గిరి ఆవులను తీసుకువచ్చారు. ఆవులతో గోవు, గో ఆధారిత వ్యవసాయాన్ని చేస్తున్నారు. తీసుకువచ్చిన ఆవులకు రవాణా సబ్సిడీ ఇవాలని రైతులు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆవులను జేసీ షరీఫ్ పరిశీలించారు. ఒక్కో ఆవుకు రవాణా చార్జి కింద ప్రభుత్వం రూ.10 వేలు చెల్లిస్తుందని చెప్పారు. ఒక్కో రైతుకు నాలుగు పశువుల వరకు ఈ సబ్సిడీ చెల్లించే అవకాశం ఉందన్నారు.
ప్రభుత్వం రైతులకు 75 శాతం సబ్సిడీపై సరఫరా చేస్తున్న చాప్ కట్టర్ల వల్ల రైతులకు అనేక సమస్యలు వస్తున్నాయని, త్రీఫేజ్ విద్యుత్ ఉంటే చాప్ కట్టర్ పనిచేస్తుందని, మరమ్మతులకు గురైనప్పుడు దాని విడిభాగాలు లభించడం కష్టమవుతుందని రైతులు ఏజేసీకి వివరించారు. రైతులు స్వయంగా తయారుచేయించుకున్న చాప్ కట్టర్ను చూపించారు. రైతులు తయారు చేస్తున్న జీవామృతం యూనిట్లను, జీవామృతాన్ని చెట్లకు పంపిణీ చేసేందుకు వినియోగిస్తున్న ట్యాంక్లను షరీఫ్ పరిశీలించారు. ఆయన వెంట పశుసంవర్థక శాఖ జేడీ డాక్టర్ జ్ఞానేశ్వరరావు, ఏడీ డాక్టర్ ఎస్టీవీ సత్యగోవింద్, మండల పశువైద్యాధికారి ఎ.వెంకటరెడ్డి పాల్గొన్నారు.