కానిస్టేబుల్‌ ఆత్మహత్య | Police Constable Suicide | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ ఆత్మహత్య

Aug 17 2016 11:17 PM | Updated on Nov 6 2018 8:04 PM

వైఎస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరు పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న బుక్కపట్నం గ్రామానికి చెందిన పిల్లనాగన్నగారి రాజు(26) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ముద్దనూరు: వైఎస్‌ఆర్‌ జిల్లా ముద్దనూరు పోలీసుస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్న బుక్కపట్నం గ్రామానికి చెందిన పిల్లనాగన్నగారి రాజు(26) పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ముద్దనూరుకు సమీపంలో శ్రీమునయ్య కోనలో రాజు మృతదేహాన్ని గుర్తించారు. ఈనెల 4న మండలంలోని కొర్రపాడులో రాజు వివాహం జరిగింది. పెళ్లయిన 13రోజులకే  మరణించడంతో బంధువులు, స్నేహితుల, తోటి సిబ్బంది విషాదంలో మునిగిపోయారు. ఎస్‌ఐ నరసింహారెడ్డి సమాచారం మేరకు.. నాలుగున్నరేళ్లుగా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రాజు మంగళవారం మధ్యాహ్నం విధులు నిర్వహించి వెళ్లారు.

తిరిగి రాత్రి 9 గంటలకు విధులకు రావాల్సి ఉంది. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రాలేదని, సెల్‌ఫోన్‌ పనిచేయడం లేదని తల్లిదండ్రులు ఎస్‌ఐకి సమాచారం ఇచ్చారు. పోలీసులు రాజు కోసం ఆరాతీశారు. ఆచూకీ లభించలేదు. చివరికి బుధవారం జనసంచారం లేని మునయ్యకోనలో చిన్న మిద్దెపై రాజు మృతదేహం కనిపించింది. పక్కనే 3 సీసాల పురుగుమందు దొరికింది. వీటిలో ఒకటి ఖాళీగా ఉంది. సూసైడ్‌ నోట్‌ సంఘటనా స్థలంలో లభించింది. స్థానికంగా ఎవరికీ అనుమానం రాకుండా మంగళవారం మధ్యాహ్నం పురుగుమందును ప్రొద్దుటూరుకు వెళ్లి కొనుగోలు చేసి, మూడున్నర గంటల ప్రాంతంలో ముద్దనూరు బస్సులో ఎక్కినట్లు టికెట్‌ ఆధారంగా పోలీసులు గుర్తించారు. సూసైడ్‌ నోట్‌లో ఆమ్మ, నాన్న, చరిత(భార్య) నన్ను క్షమించండి అంటూ తనకు బాకీ వున్న కానిస్టేబుళ్ల వివరాలు, తాను బాకీ చెల్లించాల్సిన వారి పేర్లు రాశారు. పదహారునాళ్ల పండగ కూడా జరగకుండానే రాజు మరణించడంతో బంధువులు బోరున విలపించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. మృతుని తండ్రి సుబ్బారాయుడు ఫిర్యాదు మేరకు ఆత్మహత్య కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్‌.ఐ నరసింహారెడ్డి తెలిపారు. సీఐ రవిబాబు మృతదేహాన్ని సందర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement