ఆశ్రయం ఇస్తే ప్రాణం తీశాడు | old man murdered | Sakshi
Sakshi News home page

ఆశ్రయం ఇస్తే ప్రాణం తీశాడు

Aug 2 2016 12:08 AM | Updated on Sep 4 2017 7:22 AM

తాగి దూషిస్తున్నాడని ఆశ్రయం ఇచ్చిన వ్యక్తినే దారుణంగా హత్య చేశాడో దుర్మార్గుడు.

  • మద్యం మత్తులో దూషిస్తున్నాడని తలపై రాడ్‌తో కొట్టి వ్యక్తి హత్య
  • భాగ్యనగర్‌ కాలనీ: తాగి దూషిస్తున్నాడని ఆశ్రయం ఇచ్చిన వ్యక్తినే దారుణంగా హత్య చేశాడో దుర్మార్గుడు. ఆనక మృతదేహాన్ని బూత్‌రూమ్‌లో దాచి పరారయ్యాడు. కూకట్‌పల్లి పోలీసుస్టేషన్‌ పరిధిలో సోమవారం ఈ ఘటన జరిగింది.  కూకట్‌పల్లి సీఐ పురుషోత్తమ్‌ యాదవ్‌ కథనం ప్రకారం... బీహార్‌కు చెందిన పన్నాలాల్‌ షా (55) మూసాపేట గూడ్స్‌షెడ్‌ రోడ్డులో నివాసం ఉంటూ స్థానిక చక్రగిరి ట్రాన్స్‌పోర్ట్‌లో మెకానిక్‌గా పని చేస్తున్నాడు.

     

    పది రోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లిన పన్నాలాల్‌ నగరానికి తిరిగి వస్తూ తన వెంట అదే గ్రామానికి చెందిన సంజీవ్‌ అనే వ్యక్తిని తీసుకొచ్చాడు. అతడిని తన వద్ద అసిస్టెంట్‌ మెకానిక్‌గా చేర్చుకొని, తన రూమ్‌లోనే వసతి కల్పించాడు. పన్నాలాల్‌కు మద్యం తాగే అలవాటు ఉంది.  తాగినప్పుడు అసభ్యకరంగా మాట్లాడుతూ సంజీవ్‌ని వేధించేవాడు.  దీంతో విసుగు చెందిన సంజీవ్‌... ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఉన్న పన్నాలాల్‌ తలపై ఐరన్‌ రాడ్‌తో విచక్షణా రహితంగా కొట్టి చంపేశాడు. తర్వాత మృతదేహాన్ని బాత్‌రూమ్‌లో దాచి పెట్టి సంజీవ్‌ పరారయ్యాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. తలపై ఐరన్‌ రాడ్‌తో కొట్టడంతో మృతి చెందినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న నిందితుడు కోసం గాలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement