జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడి ఎన్నిక కోసం శనివారం పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు.
పోటాపోటీగా నామినేషన్లు
Apr 8 2017 11:23 PM | Updated on Oct 17 2018 6:27 PM
– మూడేళ్ల తర్వాత ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘానికి ఎన్నికలు
– అధ్యక్ష పదవి కోసం ఏడుగురు నామినేషన్లు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లా ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం అధ్యక్షుడి ఎన్నిక కోసం శనివారం పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర సంఘం కార్యదర్శి డీఎస్ కొండయ్య ఎన్నికల అధికారి హోదాలో సి.క్యాంపు సెంటరులోని ప్రభుత్వ వాహన డ్రైవర్ల సంఘం పంక్షన్ హాల్లో నామినేషన్లు స్వీకరించారు. అధ్యక్ష పదవికి ఏడుగురు నామినేషన్లు వేయడం విశేషం. మాజీ అధ్యక్షుడు అబ్దుల్హమీద్, మాజీ ఉపాధ్యక్షుడు వై.నాగేశ్వరరావు, ఇతర నాయకులు గోవిందు, ఇలియాస్బాషా, ఎన్ మౌలాలి, పి. విజయకుమార్, ఎ. శ్రీను.. తమ నామినేషన్లను ఎన్నికల అధికారికి సమర్పించారు. ఆదివారం నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అదేరోజున ఉపసంహరణకు అవకాశం ఇస్తారు. ఉపసంహరణ సమయం ముగిసిన తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ఎన్నికల అధికారి ప్రకటిస్తారు. ఈ నెల 16న పోలింగ్ జరుగనుంది. సంఘంలో ఓటర్లుగా 208 మంది ఉన్నారు. పోటీలో ఉండే అభ్యర్ధులు సోమవారం నుంచి ప్రచారం ప్రారంభించనున్నారు. అబ్దుల్హమీద్, నాగేశ్వరరావు మినహా మిగిలిన వారు నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement