
ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఎందుకీ ఏడుపు?
ఆరు దశాబ్దాలకుపైగా అధికారంలో ఉండి తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించలేదు. మేమా పనిచేస్తుంటే కాంగ్రెస్...
కాంగ్రెస్, టీడీపీలపై మంత్రి హరీశ్రావు ధ్వజం
మెదక్: ‘ఆరు దశాబ్దాలకుపైగా అధికారంలో ఉండి తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి ప్రాజెక్టులు నిర్మించలేదు. మేమా పనిచేస్తుంటే కాంగ్రెస్, టీడీపీ నాయకులు తమ ఉనికి ఎక్కడ గల్లంతవుతుందోనని కన్నీళ్లు పెడుతున్నారు’ అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన మెదక్ జిల్లా సిద్దిపేట, మెదక్ పట్టణాలలో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాల్లో పాల్గొని ప్రసంగించారు. పాలమూరు జిల్లాకు చెందాల్సిన సాగునీటిని ఆంధ్రా నాయకులు వారి ప్రాంతానికి మళ్లించుకుపోతే ఈ ప్రాంత నాయకులు ఎందుకు ప్రశ్నించలేదన్నారు.
స్వరాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మిస్తుంటే కాంగ్రెస్ నేత జైపాల్రెడ్డి తెలంగాణ ద్రోహులైన టీడీపీ నాయకులతో కలసి ప్రెస్మీట్ పెట్టడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. తెలంగాణలోని మెదక్తో పాటు మరో రెండు జిల్లాలను సస్యశ్యామలం చేసే అటు మల్లన్నసాగర్ను అడ్డుకుంటూ, ఘణపురం ప్రాజెక్టు ఎత్తు పెంపుతో మరో 20 వేల ఎకరాలకు సాగునీరిస్తామంటే అడ్డు పడుతూ కాంగ్రెస్, టీడీపీలు చేస్తున్న రాజకీయాలు ఎవరి కోసమని ఆయన ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రూ.900 కోట్లు ఖర్చుచేసి పాలమూరు జిల్లాలోని 4.50 లక్షల ఎకరాల బీడు భూములకు నీరందించనుందని మంత్రి తెలిపారు. మరో 8 లక్షల ఎకరాలకు పులిచింతల, నెట్టెంపాడు ప్రాజెక్టుల నుంచి సాగు నీరందిస్తామన్నారు.