అనంతలో భారీ అగ్నిప్రమాదం.. రూ.21 కోట్ల నష్టం | Huge fire mishap in anathapuram, Rs 21 crore lost | Sakshi
Sakshi News home page

అనంతలో భారీ అగ్నిప్రమాదం.. రూ.21 కోట్ల నష్టం

Apr 26 2016 11:48 PM | Updated on Sep 3 2017 10:49 PM

అనంతలో భారీ అగ్నిప్రమాదం.. రూ.21 కోట్ల నష్టం

అనంతలో భారీ అగ్నిప్రమాదం.. రూ.21 కోట్ల నష్టం

అనంతపురం నగర శివారులోని సోములదొడ్డి వద్దనున్న మద్యం సరఫరా గోడౌన్ (ఐఎంఎల్ డిపో) పూర్తిగా తగలబడిపోయింది.

- భారీగా మద్యం కేసులు దగ్ధం
- రూ.21 కోట్ల నష్టం


(సాక్షిప్రతినిధి, అనంతపురం): అనంతపురం నగర శివారులోని సోములదొడ్డి వద్దనున్న మద్యం సరఫరా గోడౌన్ (ఐఎంఎల్ డిపో) పూర్తిగా తగలబడిపోయింది. మంగళవారం రాత్రి 9.45 గంటలకు ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో సిబ్బంది పరుగు పరుగున బయటకు వచ్చేశారు. చూస్తుండగానే క్షణాల్లో డిపో పూర్తిగా తగలబడిపోయింది. నష్టం సుమారు రూ.21 కోట్లు ఉంటుందని అంచనా. ఈ గోడౌన్ దాదాపు నాలుగు దశాబ్దాల కిందట నిర్మించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలకు ఇక్కడి నుంచే సరఫరా చేస్తుంటారు. ప్రతి నెలా రూ.65కోట్ల విలువైన మద్యాన్ని సరఫరా చేస్తుంటారు. 40 ఏళ్లకిందట చేసిన వైరింగే ఇప్పటిదాకా ఉంది. కరెంటు తీగలు డిపోలో ప్రమాదకరంగా ఉండటాన్ని సిబ్బంది ఇంతకుముందే గుర్తించారు. అయితే, కొత్తగా వైరింగ్ చేయడంపై శ్రద్ధ చూపలేదు. ఇదే ప్రమాదానికి కారణమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తోనే డిపో తగలబడిపోయిందని తెలుస్తోంది.

ముందు జాగ్రత్తలేవీ?
మద్యం గోడౌన్‌లో మంటలు ఆర్పేందుకు కార్బన్ సిలిండర్లను ఏర్పాటు చేయలేదు. వీటిపై డిపో అధికారులు ఏనాడూ దృష్టి సారించలేదు. సిలిండర్లు ఉన్నాయా, లేదా అన్న విషయాన్ని అగ్నిమాపక శాఖ అధికారులు కూడా పట్టించుకోలేదు. సిలిండర్లు ఉండి ఉంటే ప్రమాదం జరిగిన వెంటనే మంటలను ఆర్పే అవకాశం ఉండేదని డిపోలోని ఉద్యోగులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోయింది.

షార్ట్‌సర్క్యూట్ వల్లే జరిగిండొచ్చు
- అనురాధ, ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్

విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చాం. తగలబడిన మద్యం విలువ దాదాపు రూ.5కోట్లు ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తరువాత వెల్లడిస్తాం.

Advertisement
 
Advertisement
Advertisement