ఉత్కంఠభరితంగా క్రికెట్‌ పోటీలు | High tension in cricket competations | Sakshi
Sakshi News home page

ఉత్కంఠభరితంగా క్రికెట్‌ పోటీలు

Oct 26 2016 11:48 PM | Updated on Sep 4 2017 6:23 PM

ఉత్కంఠభరితంగా క్రికెట్‌ పోటీలు

ఉత్కంఠభరితంగా క్రికెట్‌ పోటీలు

నరసరావుపేట ఈస్ట్‌ : ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌–14 అంతర్‌ జిల్లాల ఎలైట్‌ గ్రూప్‌ పోటీలు బుధవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి.

 
నరసరావుపేట ఈస్ట్‌ : ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో అండర్‌–14 అంతర్‌ జిల్లాల ఎలైట్‌ గ్రూప్‌ పోటీలు బుధవారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఎస్‌కేఆర్‌బీఆర్‌ కళాశాలలోని ఏసీఏ, ఎస్‌కేఆర్‌బీఆర్‌ క్రికెట్‌ మైదానంలో తొలి మ్యాచ్‌ చిత్తూరు, నెల్లూరు జట్ల మధ్య నిర్వహించారు. ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర కెమిస్ట్‌ అండ్‌ డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కేపీ రంగారావు పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. కార్యక్రమాన్ని  గ్రౌండ్‌ ఇన్‌చార్జ్‌ కేవీ పురుషోత్తమరావు పర్యవేక్షించారు. టాస్‌ గెలిచి నెల్లూరు జట్టు తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన చిత్తూరు జట్టు 161 పరుగులకు ఆలౌట్‌ అయింది. జట్టులో అత్యధికంగా ఎ.గౌతమ్‌ 68, కె.గౌతమ్‌ 40 పరుగులు చేశారు. నెల్లూరు జట్టుకు చెందిన ఎన్‌.మాధవ్‌ నాలుగు వికెట్లు, బి.శరత్‌ రెండు వికెట్లు, కె.అభిషేక్‌ రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్ల నష్టానికి 129 పరుగులతో పటిష్టమైన స్థితిలో ఉంది. ఈ జట్టు కెప్టెన్‌ కె.రేవంత్‌ రెడ్డి 60 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. జట్టులోని జితిన్‌ భరద్వాజ్‌ 36 పరుగులతో గట్టి పునాది వేశాడు. చిత్తూరు జట్టు బౌలర్లు పి.అచ్యుతానంద్‌కు రెండు, ఎ.విష్టువర్ధన్‌కు ఒక వికెట్‌ దక్కాయి. గురువారం కూడా మ్యాచ్‌ కొనసాగనుంది.  పోటీలను జిల్లా మెన్‌ అండ్‌ ఉమెన్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధి కె.శోభన్‌బాబు పరిశీలించారు. కోచ్‌ వి.కృష్ణ, క్యూరేటర్‌ బి.శ్రీనివాసరావు, అసిస్టెంట్‌ క్యూరేటర్‌ వై.మల్లికార్జునరెడ్డి మ్యాచ్‌కు సహాయ సహకారాలు అందించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement