నగర శివారులో జరిగిన జంట హత్యల నేపథ్యంలో అనంత ప్రభుత్వాస్పత్రి పోలీసు భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది.
భద్రతా వలయంలో ప్రభుత్వాస్పత్రి
Jul 22 2016 12:13 AM | Updated on Jun 1 2018 8:39 PM
అనంతపురం సిటీ: నగర శివారులో జరిగిన జంట హత్యల నేపథ్యంలో అనంత ప్రభుత్వాస్పత్రి పోలీసు భద్రతా వలయంలోకి వెళ్లిపోయింది. ఒక్కసారిగా వందల మంది పోలీసులు మొహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో గోపీనాయక్, వెంకటేశ్ నాయక్ల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రిలోని మార్చూరీ గదికి తరలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మృతుడు గోపీనాయక్ సోదరుడు కుమార్ నాయక్ ..స్థానిక ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి ప్రోద్భలంతోనే హత్యలు జరిగాయన్నారు. మరోవైపు మంత్రి పరిటాల సునీత మాట్లాడుతూ, ఈ హత్యల వెనుక ఎవరున్నా.. వదల వద్దని నిందితులను కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. ఇక ఈ హత్యల వెనుక ఎలాంటి రాజకీయ కారణాలేవీ లేవని డీఎస్పీ మల్లికార్జున వర్మ వెల్లడించారు. అలాగని బాధిత కుటుంబ సభ్యులు కూడా తమకు ఫిర్యాదు చేయలేదన్నారు.
ప్రత్యేక అనుమతితో పోస్టుమార్టం
మృతదేహాలను ఎక్కువసేపు ఆస్పత్రిలో ఉంచడం వల్ల శాంతి భద్రతలు అదుపు తప్పుతాయని భావించిన పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక అనుమతితో సాయంత్రం 7.20 నిమిషాలకు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. పోలీసు అధికారులు, వైద్యులు, రెవెన్యూ అధికారుల పర్యావేక్షణలో వీడియో చిత్రీకరణ మధ్య ప్రొఫెసర్ బ్రహ్మాజీ పోస్టుమార్టం పూర్తి చేశారు. రాత్రి 8.30 గంటలకు రెండు మృతదేహాలకు బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Advertisement
Advertisement