పదవుల కోసం ఇంత నీచ రాజకీయాలా? | Sakshi
Sakshi News home page

పదవుల కోసం ఇంత నీచ రాజకీయాలా?

Published Fri, Feb 26 2016 2:36 AM

పదవుల కోసం ఇంత నీచ రాజకీయాలా? - Sakshi

వైఎస్సార్ సీపీ నేత గొల్ల బాబూరావు ఆవేదన
కోటవురట్ల: పదవుల కోసం పాకులాడి నీచ రాజకీయాలు చేసేవారిని ప్రజలు క్షమించరని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు వ్యాఖ్యానించారు.  పాములవాకలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు.  ఇటీవల కొందరు ఎమ్మెల్యేల టీడీపీలో చేరిని విషయంపై ఆయన తీవ్రంగా స్పందించారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో విలువ ఇచ్చి కుటుంబసభ్యుల్లా చూసుకుంటే ఇటువంటి నీచానికి దిగజారడం దారుణమన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి తనకు పిలిచి అసెంబ్లీ సీటు ఇచ్చారని, ఆయన పేరుతో గెలిచినా పదవిని సైతం త్యజించి మళ్లీ వైఎస్సార్ సీపీ జెండాతో ఉప ఎన్నికకు వెళ్లి అత్యధిక మెజార్టీతో గెలిచిన విషయాన్ని గుర్తు చేశారు.

ప్రాణం ఉన్నంత వరకు మన కోసం ఆలోచించిన వారి వెంటే ఉంటానని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. మరోసారి గెలిచే సత్తా లేక అడ్డదారులు తొక్కుతూ నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఆయనకు ఆది నుండి మోసాలు చేయడం అలవాటేనన్నారు. మామను వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కిన ఆయన అవే రాజకీయాలను నడుపుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణలో టీడీపీ అడ్రస్ గల్లంతు కావడంతో ఇక్కడ మైండ్ గేమ్ మొదలెట్టారని విమర్శించారు.

Advertisement
Advertisement