ఫైనాన్స్‌ వ్యాపారి బలవన్మరణం | Sakshi
Sakshi News home page

ఫైనాన్స్‌ వ్యాపారి బలవన్మరణం

Published Thu, Aug 4 2016 1:38 AM

finance businessman suicides in nittur

యాడికి: యాడికి మండలం నిట్టూరు కొత్తపల్లికి చెందిన మధుసూదన్‌నాయుడు(40) అనే  ఫైనాన్స్‌ వ్యాపారి కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పిల్లల చదువుల కోసం నాయుడు కుటుంబం బళ్లారికి వెళ్లి అక్కడే స్థిరపడినట్లు వివరించారు. అక్కడ అతను ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని చెప్పారు. అయితే అప్పుల బాధ ఎక్కువైన నేపథ్యంలో ఆయన ఉదయమే తన కార్యాలయానికి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని తనువు చాలించినట్లు పేర్కొన్నారు. బళ్లారి పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన నిట్టూరు కొత్తపల్లికి తీసుకువచ్చారు. మృతునికి భార్య, బీటెక్, ఇంటర్‌ చదివే ఇద్దరు కుమారులు ఉన్నారు.

వ్యవసాయంలో కలసి రాకనే..
మధుసూదన్‌నాయుడుకు నిట్టూరు కొత్తపల్లిలో ఇటీవల 16 ఎకరాల పొలం కొన్నట్లు తెలిసింది. అందులో పంటల సాగుకు చేసిన అప్పులు తడిసిమోపెడవడంతో వాటిని తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటన గ్రామంలో తీరని విషాదం నింపింది.

Advertisement
Advertisement