తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. చేసిన అప్పులు తీర్చే దారిలేక, వడ్డీలు పెరిగిపోవడంతో రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల ఆత్మహత్యలు ఆగడం లేదు. చేసిన అప్పులు తీర్చే దారిలేక, వడ్డీలు పెరిగిపోవడంతో రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
వికారాబాద్: అప్పుల బాధతో రంగారెడ్డి జిల్లాలో ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్ మండలం పిరంపల్లి గ్రామానికి చెందిన డేగరి సదానందం మూడెకరా భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. గొల్కొండ గ్రామీణ బ్యాంకు, ప్రైవేటు వ్యక్తుల నుంచి రూ.7 లక్షల వరకు అప్పులు చేశాడు. అయితే, ఈ ఏడాది వేసిన మొక్కజొన్న, పత్తి పంటలు ఆశాజనకంగా లేకపోవడంతో మనస్తాపం చెందాడు. గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు వికారాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సదానందం చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు.
గుత్తి: అనంతపురం జిల్లాలో అప్పుల భారంతో ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుత్తి మండలం బసినేపల్లి గ్రామానికి చెందిన బోయ వెంకట్రాముడు(56)కు 8 ఎకరాల భూమి ఉంది. మరో ఆరెకరాలు కౌలుకు తీసుకుని ఆముదం, వేరుశెనగ, మిరప సాగు చేశాడు. నీటి వసతి కోసం వేసిన 5 బోర్లు కూడా విఫలమయ్యాయి. వాటి కోసం రూ.6.50 లక్షలు చేసిన అప్పులు చేశాడు. అప్పులు తీర్చేదారి కానరాక మనస్తాపం చెందాడు. శుక్రవారం తెల్లవారు జామున ఇంట్లోనే ఫ్యానుకు ఉరి వేసుకుని చనిపోయాడు. అతనికి భార్య సంజమ్మ, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వెంకట్రాముడి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.