బల్దియా పాలన అధ్వానం | corporation administrtion bad | Sakshi
Sakshi News home page

బల్దియా పాలన అధ్వానం

Jul 30 2016 11:37 PM | Updated on Sep 4 2017 7:04 AM

రామగుండం కార్పొరేషన్‌లో పాలకవర్గం పాలన అధ్వానంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌లీడర్‌ మహాంకాళి స్వామి ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం మాట్లాడారు.

గోదావరిఖని : రామగుండం కార్పొరేషన్‌లో పాలకవర్గం పాలన అధ్వానంగా ఉందని కాంగ్రెస్‌ పార్టీ ఫ్లోర్‌లీడర్‌ మహాంకాళి స్వామి ఆరోపించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం మాట్లాడారు. కార్పొరేషన్‌లో చెత్త సేకరణకు రూ.35 లక్షలు వెచ్చించి ట్రైసైకిళ్లను కొనుగోలు చేసి పడేశారని, అవి వినియోగం లేక స్క్రాప్‌గా మారాయన్నారు. ఇంటింటికీ చెత్తను సేకరించేందుకు 40 వేల ప్లాస్టిక్‌ డబ్బాలు కొనుగోలు చేస్తున్నారని, ఇది కేవలం కమీషన్లు దండుకోవడం కోసమేనని పేర్కొన్నారు. ఈ విషయమై విజిలెన్స్‌కు ఫిర్యాదు చేస్తే వారు కూడా పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారని, నేటికి విచారణ జరపడానికి ముందుకు రాకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. కార్పొరేషన్‌లో అభివృద్ధి పాలనపై ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌ తగిన శ్రద్ధ వహించాలని డిమాండ్‌ చేశారు. సిరిసిల్ల, హుజూరాబాద్, కరీంనగర్‌ బల్దియాలకు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తుంటే స్థానిక ప్రజాప్రతినిధులు మాత్రం రామగుండం కార్పొరేషన్‌కు కనీసం కోటి రూపాయల నిధులు కూడా తీసుకురాలేకపోయారని విమర్శించారు. సింగరేణి సంస్థకు చెందిన సీఎస్‌ఆర్‌ నిధులను స్థానికంగా ఖర్చు చేయకుండా సింగరేణికి సంబంధం లేని ఇతర ప్రాంతాలలో ఖర్చు చేస్తున్నారని తెలిపారు. సమావేశంలో డెప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ బొంతల రాజేశ్, కార్పొరేటర్లు తానిపర్తి గోపాల్‌రావు, కొలిపాక సుజాత, పెద్దెల్లి ప్రకాశ్, పీచర శ్రీనివాసరావు, తిప్పారపు శ్రీనివాస్, సుతారి లక్ష్మణŠ బాబు, దార కుమార్, ముస్తాఫా, అరుణ్‌కుమార్, పర్శ శ్రీనివాస్, కారెంగుల సురేశ్‌ తదితరులు పాల్గొన్నారు.  
 
 

Advertisement
 
Advertisement
Advertisement