కాకినాడలో వంటనూనె కల్తీ గుట్టురట్టు | bursting of adulterated edible oil in kakinada | Sakshi
Sakshi News home page

కాకినాడలో వంటనూనె కల్తీ గుట్టురట్టు

Jul 2 2016 10:25 PM | Updated on Sep 4 2017 3:59 AM

తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వాకలపూడిలో ఉన్న లోహియా ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీపై అగ్‌మార్క్ అధికారులు శనివారం దాడులు చేశారు.

కాకినాడ రూరల్(తూర్పుగోదావరి): తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వాకలపూడిలో ఉన్న లోహియా ఎడిబుల్ ఆయిల్ ఫ్యాక్టరీపై అగ్‌మార్క్   అధికారులు శనివారం దాడులు చేశారు. ఢిల్లీ, గుంటూరుల నుంచి వచ్చిన అగ్‌మార్క్ అధికారులు.. కాకినాడ ఫుడ్‌సేఫ్టీ అధికారులతో కలిసి ఈ దాడులు చేశారు. ఈ సందర్భంగా సన్‌ఫ్లవర్, వేరుశనగ నూనెల్లో పామాయిల్, ఇతర నూనెలు కలిపి అమ్మకాలకు సిద్ధంగా ఉంచిన 13,423 కిలోల నూనెను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.13.42 లక్షలు ఉంటుందని నిర్ధారించారు.

స్వాధీనం చేసుకున్న ఆయిల్‌ను పోలీసులకు అప్పగించారు. ముందుగా అందిన సమాచారం మేరకు అధికారులు ఆకస్మికంగా ఫ్యాక్టరీకి చేరుకుని, ఆయిల్ టిన్నులను పరిశీలించారు. ఈ ఫ్యాక్టరీలో గోల్డ్‌ప్లస్, గోల్డ్‌డ్రాప్ లేబుల్స్‌తో ఉన్న 15 లీటర్ల డబ్బాలు, ఒక లీటర్ నూనె ప్యాకెట్లు ఉన్న పెట్టెలను గుర్తించారు. గోల్డ్‌ప్లస్ డబ్బాల్లో ఆయిల్‌ను పరిశీలించారు. ఈ డబ్బాలపై అనుమతులు లేకుండా ఆగ్‌మార్క్ గుర్తు వేసినట్టు గుర్తించారు. రికార్డులు పరిశీలించగా, అసలు ఆగ్‌మార్క్ అనుమతులే లేవని తేల్చారు.

అనంతరం గోల్డ్‌ప్లస్ బ్రాండ్‌తో అమ్మకానికి సిద్ధం చేసిన డబ్బాల్లో నూనెను పరిశీలించారు. అయితే పైన లేబుల్ ఒకలా.. లోపల నూనె మరోలా ఉన్నట్టు గమనించారు. గోల్డ్‌ప్లస్ డబ్బాల్లో 80 శాతం పామాయిల్, 20 శాతం మాత్రమే సన్‌ఫ్లవర్ ఆయిల్ ఉన్నట్టు గుర్తించారు. అలాగే వేరుశనగ నూనె లేబుల్‌తో ఉన్న డబ్బాల్లో కూడా 80 శాతం కాటన్ ఆయిల్, 20 శాతం మాత్రమే వేరుశనగ నూనె ఉన్నట్లు నిర్ధారించారు. లోహియా ఆయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యం, మేనేజర్ తదితరులపై సర్పవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement