కొన్నదే సగం.. వాటిపైనా సంశయం! | A tender for 290 vehicles | Sakshi
Sakshi News home page

కొన్నదే సగం.. వాటిపైనా సంశయం!

Nov 23 2015 2:46 AM | Updated on Oct 9 2018 7:11 PM

అత్యవసర వైద్యసేవలు అందించే ‘108’ అంబులెన్స్‌పై వైద్య ఆరోగ్యశాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది.

సాక్షి, హైదరాబాద్: అత్యవసర వైద్యసేవలు అందించే ‘108’ అంబులెన్స్‌పై వైద్య ఆరోగ్యశాఖ తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. పాత వాహనాల స్థానంలో కొత్తవి ఏర్పాటుచేసేందుకు ఉద్దేశించిన టెండర్లు, కొనుగోలు వ్యవహారం లో తీవ్ర గందరగోళానికి తెరలేపింది. ఒకే కంపెనీకి టెండర్లు ఇచ్చినా.. సగం వాహనాలకే కొనుగోలు ఆర్డర్లు ఇచ్చి మిగిలిన వాటిపై మీనమేషాలు లెక్కిస్తోంది. కొనుగోలు చేసిన వాటి ని కూడా వినియోగించుకోవడంలోనూ నిర్లక్ష్యం చూపుతోంది. దీంతో అత్యవసర వైద్యం డొక్కైపోయిన ‘108’లోనే నడుస్తోంది.

 290 వాహనాలకు టెండర్లు... 145కే ఆర్డర్లు
 ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో  316 అంబులెన్సులు ‘108’ సేవల్లో నిమగ్నమయ్యాయి. వాటిలో 195 వాహనాలు మాత్రమే కండిషన్‌లో ఉన్నాయి. 121 వాహనాలు పూర్తిగా పాడైపోయాయి. పాత వాహనాల స్థానే కొత్త వాటిని తీసుకురావడం... పెరుగుతున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని 290 అంబులెన్సు వాహనాలను కొనుగోలు చేయాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ ప్రకారం టెండర్లు పిలవగా టాటా మోటార్స్ లిమిటెడ్ వాటిని దక్కించుకుంది. అయితే, ఆ కంపెనీకి 145 వాహనాలకే ఆర్డర్లు ఇచ్చారు. మిగిలిన 145 వాహనాలకు సంబంధించి ఇప్పటికీ ఎ లాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ పెద్దలు తమకు సంబంధించిన వారికి టెండర్ కట్టబెట్టేందుకే ఇలా చేశారన్న విమర్శలు వచ్చాయి. అయితే, దీనిపై వైద్య ఆరోగ్యశాఖ ఇప్పటికీ స్పష్టమైన జవాబు చెప్పలేకపోతోంది.

 రోడ్డెక్కించడంలోనూ నిర్లక్ష్యం
 టాటామోటార్స్ నుంచి కొనుగోలు చేసిన 145 వాహనాలను  క్షేత్రస్థాయిలో ప్రవేశపెట్టడంలో నూ వైద్య ఆరోగ్య శాఖ వెనుకాముందాడుతోం ది. ఇప్పుడున్న వాహనాలు చీటికిమాటికి మరమ్మతులకు గురవుతుండడంతో రోగుల తరలింపులో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నా యి. ఒక్కోసారి మధ్యలోనే మొరాయిస్తున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కానీ, కొత్తవాటిని మాత్రం వినియోగించడంలేదు. వైద్య పరికరాలు పూర్తిగా ఏర్పాటుచేయకపోవడంవల్లే వీటిని వినియోగంలోకి తీసుకురావడంలేదని పేర్కొంటూ అధికారులు తప్పించుకోజూస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement