బస్సు ఢీకొని మహిళ మృతి | Women Died in RTC Bus Accident West Godavari | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని మహిళ మృతి

Feb 1 2019 7:31 AM | Updated on Feb 1 2019 7:31 AM

Women Died in RTC Bus Accident West Godavari - Sakshi

పూలపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కొప్పినీడి సరోజిని

పశ్చిమగోదావరి, పాలకొల్లు అర్బన్‌: బ్యాంక్‌ పని ముగించుకుని స్కూటర్‌పై ఇంటిముఖం పట్టిన భార్యాభర్తలను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో భార్య అక్కడికక్కడే మృతిచెందగా భర్తకు తీవ్రగాయాలైన ఘటన పూలపల్లిలో గురువారం చోటుచేసుకుంది. పట్టణ పోలీస్‌ స్టేషన్‌ రైటర్‌ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం, పాలకొల్లు మండలం వెలివెల గ్రామానికి చెందిన కొప్పినీడి పద్మ ఆంజనేయులు, అతడి భార్య సరోజిని (43) బ్యాంక్‌ పనిమీద స్కూటర్‌పై పాలకొల్లు వచ్చారు.

పని ముగించుకుని తిరిగి ఇంటికి వెళుతుండగా పూలపల్లి వద్ద భీమవరం నుంచి పాలకొల్లు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో సరోజిని అక్కడికక్కడే మృతి చెందగా ఆంజనేయులు వెన్నెముక జారిపోవడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతురాలికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరిలో పెద్ద కుమార్తె సాయిరత్నం గ్రామంలో డ్వాక్రా యానిమేటర్‌గా పనిచేస్తున్నారు. రెండో కుమార్తె వెంకట దుర్గ డిగ్రీ పాసై ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు. స్టేషన్‌ రైటర్‌ నాగేశ్వరరావు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement