సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో శనివారం సాయంత్రం ఓ ఎలక్ట్రిక్ స్కూటీ ఒక్కసారిగా మంటలు చెలరేగి దగ్ధమైంది. నకిరేకల్లోని ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న స్కూటీ అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దాంతో అక్కడున్న ప్రజలు భయంతో పరుగులు తీశారు. స్కూటీకి మంటలు వేగంగా వ్యాపించడంతో వాహనం పూర్తిగా కాలిపోయింది. దగ్ధమైన స్కూటీ ఓలా కంపెనీకి చెందినదిగా స్థానికులు చెబుతున్నారు.
మంటలు చెలరేగిన సమయంలో రహదారిపై వాహనాలు, పాదచారులు ఉండటంతో కొంతసేపు గందరగోళం నెలకొంది. అయితే ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం కానీ ఎవరికీ పెద్దగా గాయాలు కానీ కాలేదు. సదరు ఘటనపై స్థానిక పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో భద్రతా ప్రమాణాలపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ ఘటన ఎలక్ట్రిక్ వాహనాల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది.


