ఆస్తి కోసం కొట్టుకున్న అన్నదమ్ములు | Property Fight Between Brothers In Mandasa | Sakshi
Sakshi News home page

అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా

Jul 13 2019 7:24 AM | Updated on Jul 13 2019 7:24 AM

Property Fight Between Brothers In Mandasa - Sakshi

సాక్షి, మందస(శ్రీకాకుళం) : మండలంలోని పితాతొళి పంచాయతీ పుచ్చపాడులో శుక్రవారం అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా చోటు చేసుకుంది. వీరిలో అన్నయ్య శిస్టు శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలయ్యాయి. మందస పోలీసుల వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన అన్నదమ్ములు శిస్టు శ్రీనివాసరావు, తాతారావుల మధ్య కొన్నేళ్లుగా ఆస్తి తగాదాలున్నాయి. తాతారావు పొలం దున్నుకుని వస్తున్నాడు. ఇప్పటికే వివాదాలున్న పొలం ఎందుకు దున్నావని అన్నయ్య ప్రశ్నించడంతో గొడవ ప్రారంభమైంది.

వాగ్వాదం మరింత పెరిగి, తాతారావుతోపాటు కుటుంబ సభ్యులైన హేమసుందర్, బాలనాగమ్మ, నాగేశ్వరరావు వెదురు కర్రలతో శ్రీనివాసరావుపై దాడి చేశారు. ఈ దాడిలో ఈయన తీవ్రంగా గాయపడగా, ఈయన భార్యకు కూడా దెబ్బలు తగలడంతో స్పృహ కోల్పోయింది. మందస 108 అంబులెన్స్‌ ఈఎంటీ డీ తారకేశ్వరరావు, పైలట్‌ వీ మురళీమోహన్‌ బాధితులను పలాస ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. శ్రీనివాసరావు పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం కిమ్స్‌లో చేర్పించారు. ఎస్‌ఐ చిట్టిపోలు ప్రసాద్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement