
హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న ఆత్మకూరు డీఎస్పీ మక్బూల్
సాక్షి, పొదలకూరు (నెల్లూరు): ‘చేజర్ల మండలం కాకివాయిలో జరిగిన హత్యకు ఆస్తి వివాదమే కారణం. నిందితులను స్వల్ప వ్యవధిలోనే అరెస్ట్ చేశాం’ అని ఆత్మకూరు డీఎస్పీ ఎస్.మక్బూల్ తెలిపారు. మంగళవారం పొదలకూరు సీఐ కార్యాలయంలో హత్య కేసు వివరాలను డీఎస్పీ వెల్లడించారు. కాకివాయికు చెందిన మన్నెం చెంచమ్మ, మన్నెం పెదమస్తానయ్యలకు మన్నెం మస్తానయ్య, ఏపూరు మస్తానమ్మ, మన్నెం చినమస్తానయ్య (మృతుడు), ఇరువురు ధనమ్మ సంతానం. వీరందరికీ వివాహాలు జరిగి వేర్వేరుగా ఉంటున్నారు. అయితే ఏపూరు మస్తానమ్మ భర్త మృతిచెందడంతో 19 ఏళ్లుగా తల్లిదండ్రులు, సోదరుడు చినమస్తానయ్య కుటుంబంతో కలిసి కాకివాయిలో ఉంటోంది. పదేళ్ల క్రితం రెండు పక్కాఇళ్లు మంజూరయ్యాయి. అయితే ఒకే ఇంటిగా నిర్మించి కుమార్తె మస్తానమ్మ, మనుమరాలు అలేఖ్య, కుమారుడు చినమస్తానయ్య కుటుంబం ఒకే వేర్వేరు గదుల్లో నివాసం ఉండేలా తల్లిదండ్రులు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మస్తానమ్మ ఇటీవల తన కుమార్తెకు వివాహం చేసింది. ఈక్రమంలో పుట్టింటి లాంఛనాలు, ఉమ్మడి ఆస్తి విషయంలో సోదరుడితో వివాదం చోటుచేసుకుంది.
పథకం ప్రకారం
దీంతో మస్తానమ్మ పథకం ప్రకారం బంధువులను పిలిపించుకుని ఈనెల 14వ తేదీన ఉదయం స్థలం వద్ద గోడ నిర్మించేందుకు వెళ్లగా చినమస్తానయ్య అడ్డువెళ్లాడు. నిందితులు అతనితో గొడవ పెట్టుకోగా ముందుగా మన్నెం మస్తానయ్య కంపకర్రతో చినమస్తానయ్యను కొట్టాడు. మిగిలిన వారు ఏపూరు మస్తానమ్మ, ఇరువురు ధనమ్మ, ఇరువురు మాల్యాద్రి, మన్నెం ధనమ్మ, మన్నెం మహేష్లు రాళ్లు, చేతులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన చినమస్తానయ్యను మెరుగైన చికిత్స కోసం చెన్నైకు తరలిస్తుండగా మృతిచెందాడు. ఈ మేరకు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించారు. సమావేశంలో సీఐ జి.గంగాధర్రావు, చేజర్ల ఎస్సై కాంతికిరణ్, సిబ్బంది పాల్గొన్నారు.