వ్యభిచార గృహంపై దాడి | Police Bust Prostitution Racket In Chirala | Sakshi
Sakshi News home page

వ్యభిచార గృహంపై దాడి

Sep 20 2019 11:11 AM | Updated on Sep 20 2019 11:11 AM

Police Bust Prostitution Racket In Chirala - Sakshi

నిందితుల వివరాలను వెల్లడిస్తున్న సీఐ నాగ మల్లేశ్వరరావు

సాక్షి, చీరాల రూరల్‌ (ప్రకాశం): చీరాల రామకృష్ణా పురం పంచాయతీలోని బోడిపాలెంలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ వ్యభిచార గృహంపై చీరాల ఒన్‌టౌన్‌ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో గృహ నిర్వాహకులతో పాటు ఒక పురుషుడు, నలుగురు మహిళలను అరెస్టు చేశారు. వారివద్ద రూ. 9,230 నగదును స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి ఒన్‌టౌన్‌ సీఐ నరహరి నాగ మల్లేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలను వెల్లడించారు. రామకృష్ణాపురం పంచాయతీలోని బోడిపాలెంలో నివాసముండే అన్నపురెడ్డి కోటమ్మ, శంకర్, గిరిబాబులు గత కొంతకాలంగా వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. వీరు డబ్బులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడే మహిళలను, కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తలకు దూరంగా ఉండే మహిళలను గుర్తిస్తారు.

వారికి డబ్బులు ఆశచూపించి లోబరుచుకుని వ్యభిచార కూపంలోకి బలవంతంగా దించుతారు. అంతేకాక వారు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని ఇతర ప్రదేశాలకు కూడా విస్తరించారు. ఈ విధంగా వారు వ్యాపార పరంగా చీరాలతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వ్యభిచార మహిళలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. ఈ క్రమంలోనే వారు చీరాల, ఈపురుపాలెం, విజయవాడ, గుంటూరు, వైజాగ్, వంటి ప్రాంతాలకు చెందిన మహిళలను చీరాలకు తీసుకువచ్చి వ్యభిచారం చేయిస్తున్నారని సిఐ తెలిపారు. అయితే ఇటువంటి సంఘటనలపై తరచు ఫిర్యాదులు అందుతుండడంతో ఆయా ప్రదేశంపై పోలీసులు ఎప్పటినుండో నిఘా పెట్టారు. పూర్తి సమాచారం అందుకున్న ఒన్‌టౌన్‌ సీఐ నాగ మల్లేశ్వరరావు తమ సిబ్బందితో రామకృష్ణాపురంలోని బోడిపాలెం వ్యభిచార గృహంపై దాడిచేశారు.

ఈ దాడిలో ఒక పురుషుడితో పాటు నలుగురు మహిళలను పోలీసులు అదుపులోని తీసుకుని అరెస్టు చేశారు. వారితో పాటు గృహ నిర్వాహకులైన అన్నపురెడ్డి కోటమ్మ, శంకర్, గిరిబాబులను కూడా అరెస్టు చేశారు. వారిని తనిఖీలు చేయగా వారివద్ద రూ. 9,230 నగదు పట్టుబడినట్లు ఆయన తెలిపారు. పట్టుబడిన నగదుతో పాటు నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడి మహిళలను బలవంతంగా వ్యభిచార కూపంలోని దించినట్లయితే కఠినంగా శిక్షిస్తామని సీఐ హెచ్చరించారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement