పాతబస్తీలో నడిరోడ్డుపై వ్యక్తి దారుణ హత్య

Man Brutally Murdered On The Road In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  నగరంలో దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి నడిరోడ్డుపై దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పాతబస్తీ మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నయాపూల్‌లో బుధవారం సాయంత్రం 7గంటల ప్రాంతంలో జరిగింది. హత్యకు గురైన వ్యక్తిని షకీల్‌ ఖురుషీగా గుర్తించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. తన తల్లి, చెల్లిని అత్యాచారం చేసి చంపుతానని వేధింపులకు దిగడంతోనే  ఓ పథకం ప్రకారం అబ్దుల్‌ ఖాజా ఈ హత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

కాగా ఈ దారుణం జరుగుతున్న సమయంలో ట్రాఫిక్‌ పోలీసులు అక్కడే ఉండటం గమనార్హం. కత్తితో ఖురుషీని అబ్దుల్‌ ఖాజా అతి కిరాతకంగా నరుతున్నప్పుడు అక్కడున్న వారందరూ చోద్యం చూశారే తప్ప ఎవరూ అడ్డుకొనే సాహసం చేయలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని నిందితుడు ఖాజాను అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు. నెల క్రితం చోటుచేసుకున్న అత్తాపూర్‌ ఘటన మరవక ముందే నడి రోడ్డుపై మరో వ్యక్తి దారుణ హత్య నగరంలో కలకలం రేపుతోంది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top