బలవంతంగా బాలిక మెడలో తాళి | Man Arrest in Marriage With Minor Girl in West Godavari | Sakshi
Sakshi News home page

బలవంతంగా బాలిక మెడలో తాళి

Dec 18 2019 1:19 PM | Updated on Dec 18 2019 1:19 PM

Man Arrest in Marriage With Minor Girl in West Godavari - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్‌ వెనుక నిందితుడు

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌: బాలికను ప్రేమ పేరుతో వేధించడంతో పాటు చంపుతానని బెదిరించి బలవంతంగా వివాహం చేసుకున్న యువకుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏలూరు రూరల్‌ పోలీసు సర్కిల్‌ కార్యాలయంలో ఏలూరు డీఎస్పీ ఓ.దిలీప్‌కిరణ్‌ మంగళవారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెదవేగి మండలం కె.కన్నాపురం ప్రాంతానికి చెందిన ఆనంద్‌కుమార్‌ (23) కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఓ బాలిక ద్వారకాతిరుమలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇంటివద్ద ఉంటూ రోజూ కళాశాలకు వెళ్లి వస్తోంది. ఈనేపథ్యంలో ఆనంద్‌కుమార్‌ ఆమె వెంట పడుతూ కొంతకాలంగా వేధిస్తున్నాడు. విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు అతడిని మందిలించినా ఆనంద్‌కుమార్‌ పట్టించుకోలేదు. దీంతో బాలిక తల్లిదండ్రులు ఆమె ను చదువు మానిపించి తమ వెంట కూలీపనులకు తీసుకువెళుతున్నారు.

ఈనెల 15న తల్లిదండ్రులతో పాటు బాలిక కూలీ పనులకు వెళ్లి మధ్యాహ్న సమయంలో భోజనం కోసం ఇంటికి వచ్చింది. అక్కడే కాపుకాసిన ఆనంద్‌కుమార్‌ కర్రతో కొట్టి చంపుతానని బెదిరించి బలవంతంగా ఆమె మెడలో తాళికట్టాడు. అనంతరం బాలికను మోటారుసైకిల్‌పై ఎక్కించు కుని తన ఇంటికి తీసుకువెళ్లాడు. దీనిపై అదే రోజు బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై రామ్మోహనరావు నిందితుడిని 24 గంటల్లో అరెస్ట్‌ చేశారు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి అతడికి 14 రోజుల రిమాండ్‌ విధించారు. మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, మహిళలు ఆపదలో ఉంటే 100, 112కు కాల్‌ చేయాలని, అతి తక్కువ సమయంలో రక్షణ కల్పిస్తామని డీఎస్పీ దిలీప్‌కిరణ్‌ స్పష్టంచేశారు. ఏలూరు రూరల్‌ సీఐ ఎ.శ్రీనివాసరావు, పెదవేగి ఎస్సై రామ్మోహనరావు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement