వందల కోట్లు లంచంగా ఇచ్చా

IMA Scam Accused Says He Paid Rs 400 Crore Bribe - Sakshi

యశవంతపుర (బెంగళూరు): కర్ణాటకలో ముఖ్యమైన రాజకీయ నేతలు, ప్రభుత్వాధికారులకు రూ. 400 కోట్లను లంచంగా ఇచ్చానని ఐఎంఏ జ్యువెల్స్‌ సంస్థ యజమాని మహ్మద్‌ మన్సూర్‌ ఖాన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణలో వెల్లడించినట్లు సమాచారం. రూ. 4 వేల కోట్ల డిపాజిట్లను మన్సూర్‌ ఖాన్‌ ప్రజల నుంచి సేకరించి మోసం చేయడం తెలిసిందే. ఈ కేసులో మన్సూర్‌ను ఈడీ శనివారం కస్టడీకి తీసుకుని విచారణ ప్రారంభించారు. దీంతో రాష్ట్రంలో పలువురు నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఈ కేసులో తాము ఇరుక్కుపోతామా? అని భయాందోళనకు గురవుతున్నట్లు సమాచారం.

ఈ కేసులో ఒక ఐఏఎస్‌ అధికారిని సిట్‌ ఇప్పటికే అరెస్టు చేసింది. కాంగ్రెస్‌ రెబల్‌ ఎమ్మెల్యే రోషన్‌బేగ్‌ను విచారించింది. కాగా, ఛాతిలో నొప్పి రావడంతో మన్సూర్‌ ఖాన్‌ను ఆదివారం రాత్రి సర్‌ జయదేవ ఆస్పత్రికి తరలించారు. దుబాయ్‌ నుంచి వచ్చిన మన్సూర్‌ ఖాన్‌ను శుక్రవారం ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్ట్‌ చేశారు. జూలై 23 వరకు ఆయన ఈడీ కస్టడీలో ఉండనున్నారు. (చదవండి: జువెల్లరీ గ్రూప్‌ యజమాని రూ. 209 కోట్ల ఆస్తి జప్తు!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top