భర్త చేతిలో భార్య హతం

Husband Murdered  His Wife In Nasrullabad, Nizambad  - Sakshi

సాక్షి, నస్రుల్లాబాద్‌(నిజామాబాద్‌) : భర్త చేతిలో భార్య మరణించిన సంఘటన నస్రుల్లాబాద్‌ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ సందీప్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నస్రుల్లాబాద్‌ గ్రామానికి చెందిన బసగుట్ట జ్యోతి(25) అనే యువతికి 5 ఏళ్ల క్రితం కడేం గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే కొన్ని రోజులుగా భార్యపై అనుమానంతో తరచూ జ్యోతిని మానసికంగా, శారీరకంగా హింసించేవాడు. దీంతో కుల పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి భార్యాభర్తలు నస్రుల్లాబాద్‌లోనే తన తల్లివారి గృహంలోనే ఉంటున్నారు.

జ్యోతికి తల్లిదండ్రులు మరణించడంతో తనకు ఉన్న ఇద్దరు చెల్లెల్లను చూసుకుంటూ ఉండేవారు. అయితే గత నెల 29న మధ్యాహ్నం భర్త రాజు జ్యోతిని విచక్షణారహితంగా కొట్టి, గొంతు నులుముతుండగా బయట నుంచి వచ్చిన జ్యోతి చెల్లి స్వాతి చూసి అందరిని పిలిచింది. దీంతో రాజు పారిపోయాడు. అప్పటికే అపస్మారక స్థితిలో ఉన్న జ్యోతిని స్థానిక బాన్సువాడ ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స చేసిన అనంతరం నిజామాబాద్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం 9.30గంటలకు చనిపోయింది. జ్యోతి చెల్లి స్వాతి ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసుకుని శవ పంచనామ నిర్వహించి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top