నమ్మించి గొంతు కోశాడు !   

Husband Killed Wife  - Sakshi

యువతి దీక్షతో ఐదు నెలల క్రితం పెళ్లి చేసుకున్న నిందితుడు

పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి వేధింపులు.. అబార్షన్‌ చేయించుకోవాలని ఒత్తిడి

మంచిగా మాట్లాడినట్టు నటించి బ్రేడ్‌తో గొంతుకోసి హత్య

తిప్పర్తి మండలం మల్లేపల్లివారిగూడెంలో ఘటన  

ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. కలిసి బతుకుదాం అన్నాడు.. కానీ ఇంతలోనే ఆ యువకుడి మనసు మారింది. పెళ్లికి నిరాకరించాడు. ఆ యువతి మాత్రం జీవితాంతం నీతోనే ఉంటానని పట్టుబట్టింది. పెళ్లిచేసుకోవాలని యువకుడి ఇంటి ఎదుట దీక్షకు దిగింది. చేసేది లేక యువకుడు పెద్ద సమక్షంలో ఐదు నెలల క్రితం గుడిలో ఆ అమ్మాయిని పెళ్లిచేసుకున్నాడు.

ఇంతలోనే యువతి గర్భం దాల్చింది. అప్పటినుంచి వేధింపులు మరింత ఎక్కువవయ్యాయి. గర్భం తీసేసుకోవాలని నిత్యం వేధించేవాడు. ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో బ్లేడ్‌తో గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. ఈ హృదయ విచారకర సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మల్లేపల్లివారిగూడెంలో జరిగింది. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం..

తిప్పర్తి(నల్లగొండ) : తిప్పర్తి మండలం జంగారెడ్డి గూడం గ్రామ పంచాయతీ పరిధిలోని మల్లేపల్లి వారిగూడెం గ్రామానికి చెందిన జంజరాల శ్రీను గ్రామంలోని వేబ్రిడ్జిలో పనిచేస్తున్నాడు. ఇదే గ్రా మానికి చెందిన ఆసియా(22)తో ఐదేళ్ల క్రితం పరిచయం పెంచుకున్నాడు. అనంతరం పెళ్లి చేసుకోవాలని ఆసియా అడగ్గా శ్రీను నిరాకరించాడు. దీంతో ఈ ఏడాది మార్చి 9న శ్రీను ఇంటి ముందు దీక్షకు దిగింది. దీనికి గ్రామస్తులు, మహిళా సంఘాలు మద్దతు తెలిపారు. దీంతో పోలీసులు, గ్రామ పెద్దలు కలగజేసుకుని శ్రీను కుటుంబ సభ్యులతో మాట్లాడి అదే నెల 11న మిర్యాలగూడ మండలం అవంతీపురంలోని గుడిలో పెద్దల సమక్షంలో పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత శ్రీను తిప్పర్తిలో అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. అనంతరం ఆసియా గర్భవతి అయ్యింది.  అప్పటినుంచి శ్రీను గర్భం వద్దు తీసేసుకో అని వేధింపులు మొదలు పెట్టాడు.

వేధింపులు ఎక్కువ అవడంతో చుట్టు పక్కల వాళ్లు ఆసియా తల్లికి సమాచారం ఇచ్చారు. రెండు నెలల క్రితం తల్లి వచ్చి కూతురిని తన ఇంటికి తీసుకెళ్లింది. శ్రీను ఈ రెండు నెలల్లో మూడుసార్లు ఆసియా దగ్గరికి వచ్చాడు. ఆమెతో గొడవ పడి ఆమె తల్లిని కూడా కొట్టాడు. సోమవారం శ్రీను ఆసియా ఇంటికి రావడంతో ఆసియా మేనమామ భార్య గమనించింది. దాంతో శ్రీను మొదటగా ఆసియాతో మంచిగానే మాట్లాడినట్లు నటించాడు.

ఆమె వెళ్లిపోగానే ఆసియాతో గొడవకు దిగాడు.  అనంతరం తనతో తెచ్చుకున్న బ్లేడ్‌తో ఆసియా గొంతు కోయడంతో ఆసియా అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. శ్రీను బయటకు ఆందోళనగా వెళ్తుండడంతో గమనించిన ఆసియా మేనమామ భార్య అక్కడికి వచ్చేసరికి పారిపోయాడు. దీంతో ఇరుగుపొరుగు వారిని పిలిచి చూసేపరికి అప్పటికే ఆసియా ప్రాణాలు విడిచింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆధారాలను సేకరించారు.

మృతదేహంతో ఆందోళన

నిందుతుడు శ్రీను లేదా అతని కుటుంబ సభ్యులు ఇక్కడి వచ్చి సమాధానం చెప్పే వరకు మృతదేహాన్ని కదిలించేది లేదని మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన ఆందోళనచేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న నల్లగొండ డీఎస్పీ, పోలీసులను ఘెరావ్‌ చేశారు. నిందితుడు పోలీసుల అదుపు లో ఉన్నట్టు సమాచారం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top