నల్లగొండ: యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తికి జైలు శిక్ష, జరిమానా విధిస్తూ హుజూర్నగర్ రెండవ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శివరామ ప్రసాద్ మంగళవారం తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బొబ్బ కోటిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గరిడేపల్లి మండలానికి చెందిన యువతి ఉద్యోగరీత్యా హైదరాబాద్లో నివాసం ఉంటుంది. ఆమె వివాహం నిమిత్తం ఒక మ్యారేజ్ బ్యూరోకు తన బయోడేటా పంపింది. విషయం తెలుసుకున్న హైదరాబాద్లోని బోడుప్పల్లో నివాసముండే గొర్రె ప్రభుదాస్ ఆమెను సంప్రదించి, వివాహం చేసుకుంటానని నమ్మించాడు.
తాను నిరుద్యోగినని తన అవసరాలకు కొంత డబ్బు కావాలని పెద్ద మొత్తంలో వివిధ దఫాల్లో డబ్బులు తీసుకున్నాడు. తన స్వగ్రామమైన కర్నూల్లో నివాసముంటున్న తన తల్లిదండ్రులకు పరిచయం చేస్తానని ఆమెను నమ్మించి కర్నూలు కు తీసుకువెళ్లాడు. ఈక్రమంలో ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాకుండా హైదరాబాద్లోని అతడి రూమ్కి కూడా చాలాసార్లు పిలిపించుకున్నాడు. అనంతరం అధిక కట్నం ఆశించి ప్రభుదాస్ వేరే సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నాడని తెలిసి ఆమె అతనిని కలిసి పెళ్లి చేసుకోమని కోరగా అతను అందుకు నిరాకరించి వేరే సంబంధం చేసుకుంటానని తేల్చిచెప్పాడు.
ఆమెను దుర్భాషలాడి, చంపుతానని బెదిరించడంతో సదరు యువతి గరిడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్ఐ రామకృష్ణారెడ్డి కేసు నమోదు చేశారు. హుజూర్నగర్ సీఐ భాస్కర్ దర్యాప్తును పూర్తి చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. సాక్షుల పూర్తి విచారణ అనంతరం అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ బొబ్బ కోటిరెడ్డి వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం నిందితుడు గొర్రె ప్రభుదాస్పై నేరం నిరూపణ కావడంతో మూడేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ 1,500ల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి డాక్టర్ శివరాం ప్రసాద్ తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించని పక్షంలో మరొక నెల రోజులు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పులో పేర్కొన్నారు. ప్రాసిక్యూషన్కు లైజన్ ఆఫీసర్ వెంకన్న సహకరించారు.


