సెల్ఫీ సరదా.. ప్రాణాలు తీసింది | Fun with selfie..life has gone | Sakshi
Sakshi News home page

సెల్ఫీ సరదా.. ప్రాణాలు తీసింది

Mar 15 2018 6:45 AM | Updated on Mar 15 2018 6:47 AM

Fun with selfie..life has gone - Sakshi

మృతులు రాహుల్‌, ప్రణయ్‌ (ఫైల్‌ ఫోటోలు)

ఖమ్మం అర్బన్‌:  ఖమ్మంలోని ప్రయివేట్‌ కళాశాల ఇంటర్‌ సెకండియర్‌ విద్యార్థులైన నగరానికి చెందిన ఆ తొమ్మిదిమంది మిత్రులు బుధవారం చివరి పరీక్ష రాశారు. ఆనందంగా ఇళ్లకెళ్లారు. భోజనాలు ముగించుకున్నారు. 

- ‘హమ్మయ్య.. పరీక్షలు అయిపోయాయి. ఎవరెవరం ఎక్కడ చదువుతామో, ఏ స్థాయిలో ఉంటామో తెలియదు. అందుకే, ఈ చివరి రోజున సెల్ఫీలు దిగుదాం.. జ్ఞాపకాలుగా దాచుకుందాం’ అని ముందే అనుకున్నారు. అంతా ఒకచోట కలుసుకున్నారు. మంచి లొకేషన్‌ కోసం మూడు బైక్‌లపై నగరంలోగల మున్నేటి వద్దకు వెళ్లారు. సెల్ఫీలు దిగుతున్నారు. 

- ముస్తాఫానగర్‌కు చెందిన మాడుగు ప్రణయ్‌(17) కాలుకు మట్టి అంటింది. నీటిలోకి దిగి శుభ్రం చేసుకుంటున్నాడు. ఇంతలో కాలు జారింది... నీటిలో పడిపోయాడు. స్నేహితులంతా నిశ్చేష్టులై చూస్తున్నారు. భయంతో వారి గొంతులు పెగల్లేదు.
 
- ఇందిరానగర్‌కు చెందిన కత్తుల రాహుల్‌(17) ఏమాత్రం ఆలోచించలేదు. మిత్రుడిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతడు కూడా నీటిలోకి జారి పడిపోయాడు. క్షణాల్లోనే ఇద్దరూ గల్లంతయ్యారు. 

- మిగతా మిత్రులు తేరుకున్నారు. వారికి ఈత రాదు. దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తున్నారు.. గట్టిగా అరుస్తున్నారు. అక్కడకు దగ్గరలో ఉన్న కొందరు పరుగు పరుగున వచ్చారు. 

- అర్బన్‌ సీఐ నాగేంద్రచారి ఆధ్వర్యంలో ఎస్‌ఐలు మోహన్‌రావు, అశోక్‌ చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తీయించారు. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

- ఆ ఇద్దరు పిల్లల తల్లిదండ్రులు, కుటుంబీకులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఆ ఏడుగురు మిత్రులకు కన్నీళ్లు ఆగడం లేదు.  రాహుల్‌ తండ్రి ప్రసాద్, ఐసీడీఎస్‌ ఉద్యోగి. ఫ్రెండ్స్‌తో బయటికెళుతున్నానని అమ్మతో చెప్పి వెళ్లాడని, ఇక తిరిగి రాడని అనుకోలేదని అంటూ తల్లి రాధిక గుండె బాదుకుంటోంది.  ప్రణయ్‌ తండ్రి బీమా కంపెనీలో చిరుద్యోగి.


 

Advertisement
 
Advertisement
Advertisement