క్షుద్రశక్తుల కోసం నాలుగేళ్ల చిన్నారి నరబలి

Four Years Girl Human Sacrifice In Tamil nadu - Sakshi
తమిళనాడులో మంత్రగత్తె అరెస్ట్‌

సాక్షి ప్రతినిధి, చెన్నై: మనిషిలోని మూఢనమ్మకాలకు, శక్తిమంతురాలైన మంత్రగత్తెను కావాలన్న స్వార్థానికి నాలుగేళ్ల చిన్నారి నర బలైంది. నిందితురాలి అరెస్ట్‌తో ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పుదుకోట్టై జిల్లా కరుంపట్టికి చెందిన పళనిస్వామి (35) భవన నిర్మాణ కార్మికుడు. ఇతని కుమార్తె షాలిని (4) గతనెల 25న ఇంటికి సమీపంలో ఆటలాడుకుంటుండగా కనిపించకుండా పోయిం ది. ఇంటికి ఒక కిలోమీటర్ల దూరంలో బ్లేడుతో గొంతుకోసిన స్థితిలో హత్యకు గురై ఉండగా స్థానికులు గుర్తించారు. శవం దొరికిన ప్రదేశంలో సెమ్ముని ఆలయం ఉండడంతో బాలికను బలి ఇచ్చి ఉండొచ్చనే కోణంలో ఇలుప్పూరు పోలీసులు విచారణ ప్రారంభించారు. అదే ప్రాంతానికి చెందిన సోది చెప్పే శింగారం భార్య చిన్నపిల్లై (47) అనే మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె చేతిలో సైతం బ్లేడుతో కోసుకున్నట్లుగా గాయం ఉండడంతో విచారణను తీవ్రతరం చేసి చిన్నపిల్లైని సోమవారం అరెస్ట్‌ చేశారు. గగుర్పొడిచే వివరాలతో పోలీసులకు ఆమె వాంగ్మూలం ఇచ్చింది.

నిందితులరాలి వాగ్మూలం..
‘‘చిన్నారి షాలిని ఇంటికి సమీపంలోనే కొన్నేళ్లుగా నేను నివసిస్తున్నాను. దేవుడి పూనినట్లుగా ఆడడం, సోది చెప్పడం వంటి చేస్తూ జీవనం సాగిస్తున్నాను. సమీపంలోని అడవిలో ఉన్న సెమ్ముని ఆలయంలో కోడి, పొట్టేలు, గొర్రెలను బలిఇచ్చి సోది చెబుతుంటాను. నరబలి ఇవ్వడం ద్వారా నా మంత్రశక్తి పెంచుకోవాలని భావించాను. ఇందుకు చిన్నారి షాలినీని ఎంచుకున్నాను. షాలినీని ఎత్తుకెళ్లేందుకు సమయం కోసం ఎదురుచూస్తుండగా గతనెల 25వ తేదీన ఒంటరిగా ఆడుకుంటోంది, జనసంచారం  పెద్దగా లేకపోవడంతో షాలినీని చంకనవేసుకున్నాను. నేను బాగా పరిచయం ఉండడంతో మారం చేయకుండా నాతో వచ్చేసింది. నేరుగా సెమ్ముని ఆలయంకు వెళ్లి పూజలు చేసి నా వద్దనున్న బ్లేడుతో షాలిని గొంతుకోసి బలిచ్చాను. ఆ తరువాత శవాన్ని ఆలయానికి దూరంగా  విసిరివేసి ఇంటికి వెళ్లిపోయాను’’ అని వివరించింది. మంత్రగత్తె చిన్నపిల్లైౖని తిరుమయం కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం తిరుచ్చిరాపల్లి జైల్లో పెట్టారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top