అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి | Delhi Women Abduct Businessman From Five Star Hotel | Sakshi
Sakshi News home page

అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి

May 21 2019 8:32 AM | Updated on May 21 2019 8:32 AM

Delhi Women Abduct Businessman From Five Star Hotel - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

పారిశ్రామికవేత్తను కిడ్నాప్‌ చేసే ప్రయత్నం బెడిసికొట్టడంతో ఓ మహిళ ఊచలు లెక్కిస్తోంది.

న్యూఢిల్లీ: వ్యాపార పనుల నిమిత్తం ముంబయి నుంచి ఢిల్లీకి వచ్చి ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో దిగిన ఓ పారిశ్రామికవేత్తను కిడ్నాప్‌ చేసే ప్రయత్నం బెడిసికొట్టడంతో ఓ మహిళ ఊచలు లెక్కిస్తోంది. వివరాలు.. ముంబయిలోని మెరైన్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ ఎండీ బిజినెస్‌ పనుల నిమిత్తం గురువారం ఢిల్లీ వెళ్లి చాణక్యపురిలోని ఓ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో దిగాడు. కొద్దిసేపటి తర్వాత తనకు తెలిసిన ఓ మహిళ ఫోన్‌ చేసి కలుస్తానని చెప్పింది. అతడు సరే అనడంతో మరో మహిళతో కలిసి హోటల్‌ రూమ్‌కి వెళ్లింది. కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు మహిళలు ఆయన్ని కారులో తీసుకెళ్లారు. అనంతరం ఢిల్లీ పోలీసులకు ఓ కాల్‌ వచ్చింది. తమ సంస్థ ఎండీని ఎవరో కిడ్నాప్‌ చేశారని, రూ.30 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారని మెరైన్‌ ఇంజినీరింగ్‌ కంపెనీ ప్రతినిధి ఒకరు ఫోన్లో చెప్పారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయన వివరాలు కనుక్కొని విచారణ చేపట్టారు. ఎండీ బస చేసిన హోటల్‌ రూమ్‌లో సీసీ కెమెరాల పుటేజీని పరిశీలించగా ఆయన ఇద్దరు మహిళలతో వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో పోలీసులు ఆ కారు నంబరు ఆధారంగా పోలీసులు లక్ష్మీనగర్‌లోని ఓ ఇంటికి వెళ్లగా మహిళ కనిపించింది. వారు అడిగిన ప్రశ్నలకు ఆ మహిళ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో ఇంట్లో సోదాలు నిర్వహించారు. తాళం వేసిన ఓ గదిని తెరిచిచూడగా బాధితుడు కనిపించాడు. దీంతో ఆయన్ని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆ మహిళ సహా ఆరుగురిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. నిందితుల్లో బాధితుడు బస చేసిన ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో పనిచేస్తున్న మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement