కరోనా పరీక్షలకు తీసుకెళ్తే ఖైదీ పరార్
సాక్షి, వరంగల్ అర్బన్: కరోనా పరీక్షలకు ఆస్పత్రికి తీసుకెళ్లిన పోలీసుల కళ్లుగప్పి ఓ ఖైదీ పరారైన ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కేంద్రంలో వెలుగుచూసింది. హన్మకొండ సుబేదారికి చెందిన ఖైదీ సయ్యద్ ఖైసర్ ఎంజీఎం ఆసుపత్రి నుంచి పరారయ్యాడు. కరోనా లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షల నిమిత్తం జైలు అధికారులు ఖైసర్ను గురువారం ఉదయం ఎంజీఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు. అతని వద్ద శాంపిల్స్ సేకరించి.. కోవిడ్ వార్డులో చేర్పించారు. అక్కడ ఎస్కార్ట్ను కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఖైసర్ తప్పించుకొని పారిపోయాడు. దీంతో మట్టెవాడ పోలీస్ స్టేషన్లో జైలు సిబ్బంది ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఖైదీ అతడి కోసం గాలిస్తున్నారు. ఇక 14 చోరీలు చేసిన ఖైసర్ గత నెలలోనే పట్టుబడ్డాడు. ఈ కేసుల్లో ప్రస్తుతం అతడు వరంగల్ సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.
(మోసం చేశాడు.. న్యాయం చేయండి)