ఎంపీ అర్వింద్‌పై కేసు! | Sakshi
Sakshi News home page

ఎంపీ అర్వింద్‌పై కేసు!

Published Thu, Jan 23 2020 3:27 AM

Case against MP Arvind - Sakshi

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. పోలింగ్‌కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపి వేయాలనే నిబంధనను ఉల్లంఘించారనే ఆరోపణలపై జిల్లా ఎన్నికల అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 3వ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం కేసు నమోదు చేశారు. నగరంలోని ఓ ప్రార్థనా స్థలం వద్ద ఉన్న ఆక్రమణల విషయమై ఎంపీ తన ఫేస్‌బుక్‌ ఖాతాల్లో వివాదాస్పద వ్యాఖ్యలతో కూడిన పోస్టు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

ఈ కేసు విషయమై అర్వింద్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలోనే స్పందించారు. బ్యూరోక్రాట్‌ల విజ్ఞప్తి మేరకు ఈ పోస్టును తొలగించానని తెలిపారు. అయినప్పటికీ అధికారులు కేసులు పెడతామంటున్నారని అన్నారు. ఇదిలా ఉండగా.. బుధవారం మున్సిపల్‌ పోలింగ్‌ సందర్భంగా పోలీసులు బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారంటూ అర్వింద్‌ పోలీసు ఉన్నతాధికారులతో వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై కూడా మరో కేసు నమోదు చేసే యోచనలో పోలీసుశాఖ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే.. ఈ కేసుల విషయాన్ని పోలీసులు ధ్రువీకరించడం లేదు.

Advertisement
Advertisement