బావను హతమార్చిన బామ్మర్ది 

Brother In Law Murder Case In Mahabubnagar District - Sakshi

వంగూరు (కల్వకుర్తి): ఇంటికి వచ్చిన బావ (అక్క భర్త)కు సకల మర్యాదలు చేయాల్సిన ఓ బామ్మర్ది.. అక్కతో తరచూ గొడవపడుతున్నాడనే నెపంతో కట్టెతో కొట్టడంతో మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని డిండిచింతపల్లిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బంగారమ్మతో బిజినపల్లి మండలం పాలెం గ్రామానికి చెందిన రాములు(40)కి కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే వీరిద్దరి మధ్య తరచూ గొడవలు వస్తుండడంతో గత కొన్నిరోజులుగా బంగారమ్మ తల్లి గ్రామమైన డిండిచింతపల్లిలోనే ఉంటుంది. భార్యాపిల్లలను తీసుకెళ్లడానికి రెండు రోజుల క్రితం వచ్చిన రాములుకు బామ్మర్ది రమేష్‌కు మధ్య సోమవారం గొడవ జరిగింది.

ఈ క్రమంలో కట్టె తీసుకుని రాములు మెడపై కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో బంధువులు నీళ్లు తాపి పడుకోబెట్టారు. ఆ సమయంలోనే మృతిచెందాడు. పెళ్లయిన నాటి నుంచి భర్తతో ఉన్న గొడవలు చివరికి భర్త ప్రాణాలు పోయేవరకు వెంటాడడంతో భార్య బంగారమ్మ కన్నీరుమున్నీరయ్యింది. ఈ సంఘటన గ్రామస్తులకు తెలియడంతో పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. సమాచారం అందుకున్న కల్వకుర్తి సీఐ సురేందర్‌రెడ్డి, వెల్దండ, చారకొండ ఎస్‌ఐలు వీరబాబు, బాలకృష్ణలు ఘటనా స్థలానికి చేరుకుని హత్యకు గల కారణాలను ఇతర వివరాలను తెలుసుకుని పంచనామా నిర్వహించారు. ఇందుకు సంబంధించి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు సీఐ పేర్కొన్నారు. రాములుకు భార్యతోపాటు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top