
నటుడు, రచయిత ఉత్తేజ్
సాక్షి, హైదరాబాద్: సినీ నటుడు, రచయిత ఉత్తేజ్ పోలీసులను ఆశ్రయించారు. ఆయనకు చెందిన ఓ బట్టల షాపులో దొంగతనం జరగటంతో ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... అలంకార్ డిజైనర్స్ పేరిట అమీర్పేట ఎల్లారెడ్డి గూడలో ఉత్తేజ్కు ఓ బట్టల షాపు ఉంది. ఉత్తేజ్ భార్య పద్మావతి ఆ షాపును నిర్వహిస్తున్నారు. శనివారం ముగ్గురు మహిళలు షాపులోకి వచ్చి కస్టమర్లలాగా నటిస్తూ ఖరీదైన చీరలను దొంగిలించుకెళ్లారు. దొంగతనం జరిగిన విషయాన్ని కాస్త ఆలస్యంగా గుర్తించిన పద్మావతి విషయాన్ని భర్తకు తెలియజేశారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన ఉత్తేజ్ దొంగతనం జరిగిన విషయాన్ని గుర్తించి.. ఎస్సార్ నగర్ పోలీసులకు నిన్న సాయంత్రం ఫిర్యాదు చేశారు. చోరీకి గురైన చీరల విలువ రూ.80 వేలుగా ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు.