
సాక్షి, న్యూఢిల్లీ : ఓ వైపు బ్యాంకు అకౌంట్లకు, సంక్షేమ పథకాలకు ఆధార్ లింక్ వాలంటరీ అని సుప్రీంకోర్టు చెబుతుంటే.. మరోవైపు దీన్ని తప్పనిసరి చేస్తూ వెళ్తోంది కేంద్ర ప్రభుత్వం. ఆధార్ను తప్పనిసరి చేయడాన్నివ్యతిరేకిస్తూ ఫిర్యాదుదారులు మరోసారి ఉన్నత న్యాయస్థానం గడపతొక్కారు. ఆధార్ను తప్పనిసరి చేయడం సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడమేనంటూ ఐదుగురు సభులున్న బెంచ్కు ఫిర్యాదుదారులు చెప్పారు. అంతేకాక ప్రభుత్వం చెబుతున్న కేవలం ఆరు పథకాలకే కాక, మొత్తం 139 పథకాలకు ఆధార్ కార్డును తప్పనిసరి చేశారంటూ పిటిషన్దారులు ఆరోపిస్తున్నారు. ఆధార్ను తప్పనిసరి చేయడం వ్యక్తుల గోప్యత హక్కును ఉల్లంఘించడమని పేర్కొన్నారు. ఐరిష్ స్కాన్స్, ఫింగర్ ప్రింటింగ్ వంటి బయోమెట్రిక్ డేటా దుర్వినియోగం పాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోపించారు.
రైలు, బస్సు ప్రయాణాలు వంటి అన్ని సర్వీసులకు ఆధార్ను డిమాండ్ చేస్తున్నారని, ఆరు పథకాలకే కాక, మొత్తం 139 స్కీమ్లకు కేంద్రం ఆధార్ను డిమాండ్ చేస్తుందని ఫిర్యాదుదారుల అడ్వకేట్ శ్యాం దివాన్ చెప్పారు. బోర్డు ఎగ్జామ్స్కు, స్కాలర్షిప్లకు, ఉన్నత విద్యాభ్యాసాలకు, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్లకు ఇలా అన్నింటికీ ఆధార్ను అడుగుతున్నారన్నారు. ఆధార్ లేకపోయే సరికి హెచ్ఐవీ-పాజిటివ్ రోగులకు చికిత్స కూడా నిరాకరించారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి లేకపోతే, ఇది చాలా విచారకరమైన రోజని అభివర్ణించారు. బ్యాంకు, పైనాన్సియల్ లావాదేవీలకు, సంక్షేమ పథకాలకు ఆధార్ లింక్ చేసే డెడ్లైన్ డిసెంబర్ 31పై టాప్ కోర్టు విచారణ ప్రారంభించింది. దీనిపై రేపు మధ్యంతర ఉత్తర్వులను జారీచేయనున్నట్టు టాప్ కోర్టు పేర్కొంది. ఆశ్చర్యకరంగా రెండు రోజుల క్రితమే పాత బ్యాంకు అకౌంట్లకు, ఆధార్ను లింక్ చేసుకునే గడువును కేంద్ర ప్రభుత్వం 2018 మార్చి 31 వరకు పెంచింది.