
టోయోటా కిర్లోస్కర్ మోటార్ ఎట్టకేలకు కొత్త యారిస్ సెడాన్ను దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. బేస్ వేరియంట్ను రూ.8.75 లక్షలకు మార్కెట్లోకి లాంచ్ చేసిన టోయోటా... టాప్ ఎండ్ వేరియంట్ ధరను ఎక్స్షోరూం ఢిల్లీలో రూ.14.07 లక్షలుగా నిర్ణయించింది. ఈ కొత్త యారిస్ను కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న టోయోటా డీలర్షిప్ల వద్ద బుక్ చేసుకోవచ్చని, 2018 మే నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని కంపెనీ తెలిపింది. టోయోటా నిర్ణయించిన ధర ప్రకారం చూసుకుంటే ఈ కొత్త యారిస్, మారుతీ సుజుకీ సియాజ్, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నాలకు గట్టి పోటీ ఇవ్వనుంది. అన్ని టోయోటా డీలర్షిప్ల వద్ద ఈ కారును ప్రదర్శనకు ఉంచనున్నామని, కస్టమర్లు వెంటనే టెస్ట్ డ్రైవ్ కోసం బుక్ చేసుకోవచ్చని టోయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా తెలిపారు.
నాలుగు వేరియంట్లను ఇది ఆఫర్ చేస్తుంది. జే, జీ, వీ, వీఎక్స్ వేరియంట్లను పెట్రోల్ మాన్యువల్ లేదా పెట్రోల్ ఆటోమేటిక్లో అందిస్తోంది. తర్వాత సీవీటీ యూనిట్ను కూడా టోయోటా అందించనుంది. మిడ్ సైజ్ సెడాన్ సెగ్మెంట్లో ఉన్న ఇతర మోడళ్లకు పోటీగా అధునాతన ఫీచర్లతో ఇది కస్టమర్లను ఆకట్టుకుంటోంది. ప్రొజెక్టర్ యూనిట్లతో లార్జ్ స్వెఫ్ట్బ్యాక్ హెడ్ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్ఎస్, ఎల్ఈడీ గైడ్ లైట్స్ విత్ లార్జ్ ఫ్రంట్ గ్రిల్ విత్ గ్లోసీ బ్లాక్ స్లాట్స్, 15 అంగుళాల మల్లి స్పోక్ అలాయ్ వీల్స్, ఇంటిగ్రేటెడ్ టర్న్ సిగ్నల్ లైట్స్, లార్జ్ ఎల్ఈడీ టైల్ ల్యాంప్స్, రియర్ ఫాగ్ల్యాంప్స్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, స్టెబిలిటి కంట్రోల్, పార్కింగ్ సెన్సార్లు, ఏబీఎస్ విత్ ఈబీడీ, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, 7-ఎయిర్ బ్యాగులు వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి.
1.5 లీటరు పెట్రోల్ ఇంజిన్ 108బీహెచ్పీ పవర్ను, 140ఎన్ఎం పీక్ టర్క్ను ఉత్పత్తి చేస్తోంది. 6 స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ లేదా ఆప్షనల్ 7 స్టెప్ సీవీటీ ఆటోమేటిక్ గేర్బాక్స్ను ఇది కలిగి ఉంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ 17.1 కేఎంపీఎల్ ఇంధన సామర్థ్యాన్ని, సీవీటీ 17.8 కేఎంపీఎల్ సామర్థ్యాన్ని అందిస్తోంది.