సెన్సెక్స్ 150 పాయింట్లు అప్ | Sensex snaps 6-day fall, up 150 pts; Nifty ends above 7800 | Sakshi
Sakshi News home page

సెన్సెక్స్ 150 పాయింట్లు అప్

Nov 17 2015 1:43 AM | Updated on Sep 3 2017 12:34 PM

సెన్సెక్స్ 150 పాయింట్లు అప్

సెన్సెక్స్ 150 పాయింట్లు అప్

ఇటీవల భారీగా పతనమైన బ్లూచిప్ స్టాక్స్‌లో కొనుగోళ్ల ఊతంతో దేశీ స్టాక్‌మార్కెట్ సోమవారం లాభాల్లో ముగిసింది.

రెండు నెలల కనిష్టం నుంచి హైజంప్
* బ్లూచిప్ షేర్లలో కొనుగోళ్లు
ముంబై: ఇటీవల భారీగా పతనమైన బ్లూచిప్ స్టాక్స్‌లో కొనుగోళ్ల ఊతంతో దేశీ స్టాక్‌మార్కెట్ సోమవారం లాభాల్లో ముగిసింది. కీలకమైన బీఎస్‌ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో రెండు నెలల కనిష్ట స్థాయి నుంచి కోలుకుని 150 పాయింట్ల లాభంతో క్లోజయ్యింది. సోమవారం ట్రేడింగ్‌లో ఒక దశలో సెన్సెక్స్ రెండు నెలల కనిష్ట స్థాయి 25,451 పాయింట్లకు పతనమైనప్పటికీ ..

తర్వాత సెషన్లో అక్కణ్ణుంచి కోలుకుని 25,866 పాయింట్ల గరిష్ట స్థాయికి ఎగిసింది. చివరికి 0.58 శాతం లాభంతో 25,760 వద్ద ముగిసింది. అటు ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా 44 పాయింట్లు (0.57%) పెరిగి 7,807 వద్ద క్లోజయ్యింది. పారిస్‌లో ఆత్మాహుతి దాడులు, జపాన్ నుంచి నిరాశాజనక గణాంకాల ప్రభావంతో ఆసియా మార్కెట్ల ధోరణికి అనుగుణంగా దేశీ మార్కెట్ బలహీనంగా ప్రారంభమైంది.

అయితే రూపాయి బలపడటం, విదేశీ పెట్టుబడులపరంగా ప్రభుత్వం పలు చర్యలు ప్రకటించడం మొదలైనవి స్టాక్ మార్కెట్ కోలుకోవడానికి కారణమై ఉంటాయని జియోజిత్ బీఎన్‌పీ పారిబా టెక్నికల్ రీసెర్చ్ డెస్క్ కో-హెడ్ ఆనంద్ జేమ్స్ చెప్పారు. రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల తోడ్పాటుతో స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ సూచీలు అర శాతం దాకా పెరిగాయి.
 
బ్యాంకింగ్, ఎఫ్‌ఎంసీజీల్లో కొనుగోళ్లు..
బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసీజీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ సంస్థల షేర్లలో కొనుగోళ్లు జరగ్గా.. ఐటీ, టెక్నాలజీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మొత్తం 1,374 స్టాక్స్ లాభాల్లోనూ, 1,259 స్క్రిప్‌లు నష్టాల్లోనూ ముగిశాయి. ఆసియా మార్కెట్లు డౌన్..
 మరోవైపు పారిస్‌లో దాడులు, జపాన్ మళ్లీ మాంద్యంలోకి ప్రవేశించిందన్న గణాంకాల ప్రభావంతో ఆసియా మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. యూరోపియన్ మార్కెట్లు మిశ్రమ ధోరణి కనపర్చాయి.
 
లిస్టింగ్‌లో ఎస్‌హెచ్ కేల్కర్ పరిమళాలు..
పరిమళ ద్రవ్యాల ఉత్పత్తి సంస్థ ఎస్‌హెచ్ కేల్కర్ అండ్ కో.. లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. ఇష్యూ ధర రూ. 180తో పోలిస్తే సంస్థ షేరు ఏకంగా 23.3 శాతం అధికంగా రూ.222 వద్ద బీఎస్‌ఈలో లిస్టయ్యింది. ఆ తర్వాత 23.72 శాతం దాకా పెరిగి రూ. 222.70ని తాకింది. చివరికి 15 శాతం లాభంతో రూ. 207.30 వద్ద ముగిసింది.

బీఎస్‌ఈలో 54.83 లక్షల షేర్లు, ఎన్‌ఎస్‌ఈలో 2.3 కోట్ల షేర్లు చేతులు మారాయి. కంపెనీ మార్కెట్ విలువ రూ. 2,998 కోట్లుగా ఉంది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 500 కోట్లు సమీకరించింది.

Advertisement
 
Advertisement
Advertisement