సహారా ఇన్వెస్టర్ల కోసం సెబీ మళ్లీ అన్వేషణ | Sebi makes fresh bid to find Sahara investors for refunds | Sakshi
Sakshi News home page

సహారా ఇన్వెస్టర్ల కోసం సెబీ మళ్లీ అన్వేషణ

May 4 2015 12:35 AM | Updated on Sep 3 2017 1:21 AM

సహారా ఇన్వెస్టర్ల కోసం సెబీ మళ్లీ అన్వేషణ

సహారా ఇన్వెస్టర్ల కోసం సెబీ మళ్లీ అన్వేషణ

సహారా గ్రూప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సొమ్మును వెనక్కి ఇచ్చే ప్రయత్నాలను నియంత్రణ సంస్థ సెబీ మళ్లీ మొదలుపెట్టింది.

న్యూఢిల్లీ: సహారా గ్రూప్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్ల సొమ్మును వెనక్కి ఇచ్చే ప్రయత్నాలను నియంత్రణ సంస్థ సెబీ మళ్లీ మొదలుపెట్టింది. రిఫండ్‌కు అర్హులైన బాండ్‌హోల్డర్లు పెట్టుబడులకు సంబంధించిన రుజువులతో క్లెయిమ్ దరఖాస్తులను సమర్పించాల్సిందిగా సెబీ మరోసారి విజ్ఞప్తి చేసింది. సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్, సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్‌లు నిబంధనలకు విరుద్ధంగా నిధులను సమీకరించాయని.. ఆ మొత్తాన్ని వడ్డీతో సహా(దాదాపు రూ.25,780 కోట్లు) సహారా గ్రూప్ వెనక్కివ్వాలంటూ సుప్రీం కోర్టు తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే.

దీన్ని సెబీ ద్వారా ఇన్వెస్టర్లకు చెల్లించాలని ఆదేశించింది కూడా. కాగా, సెబీ తాజా విజ్ఞప్తి మూడోది కావడం గమనార్హం. తొలిసారిగా గతేడాది ఆగస్టులో  ఇన్వెస్టర్ల వేట మొదలుపెట్టింది. 2014 సెప్టెంబర్‌కల్లా రిఫండ్‌కు క్లెయిమ్ చేసుకోవాలని డెడ్‌లైన్ విధించింది. అయితే, రూ.4,900 కోట్ల విలువైన క్లెయిమ్‌లు మాత్రమే రావడంతో.. డిసెంబర్‌లో మళ్లీ ఇన్వెస్టర్లకు ఇదేవిధమైన విజ్ఞప్తి చేసింది. అప్పుడు ఎంతమంది దరఖాస్తు చేశారన్న వివరాలేవీ వెల్లడికాలేదు. కాగా, మూడోసారి తాజాగా చేపట్టిన అన్వేషణ ప్రక్రియకు డెడ్‌లైన్ ఏదీ నిర్ణయించకపోవడం విశేషం. ఈ కేసులో సహారా చైర్మన్ సుబ్రతా రాయ్ సహా ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు ఏడాది నుంచి తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇప్పటివరకూ సహారా గ్రూప్.. సెబీ వద్ద రూ.12,000 కోట్లను డిపాజిట్ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement