ఐపీఓకు... ఆరు ప్రభుత్వ సంస్థలు
కేఐఓసీఎల్ ఎఫ్పీఓ కూడా
ఆమోదం తెలిపిన సీసీఈఏ
న్యూఢిల్లీ: ఆరు ప్రభుత్వ రంగ సంస్థలు త్వరలో ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) రానున్నాయి. ఈ ఆరు పీఎస్యూలు ఐపీఓకు రావడానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం తెలిపినట్లు న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. అంతే కాకుండా కుద్రేముఖ్ ఐరన్ ఓర్ కంపెనీ (కేఐఓసీఎల్) ఫాలో ఆన్ ఆఫర్కు (ఎఫ్పీఓ) కూడా సీసీఈఏ ఆమోదం తెలిపింది. ఈ ఆరు పీఎస్యూలను స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేయడం వల్ల వాటి విలువ పెరుగుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఐపీఓకు రానున్న ఆరు పీఎస్యూలు ఇవే...
►రైల్ టెల్ కార్పొరేషన్ ఇండియా
►టెలికమ్యూనికేషన్ కన్సల్టెంట్స్(ఇండియా) (టీసీఐఎల్)
►నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఎస్సీ)
►తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీహెచ్డీసీఐఎల్,)
►వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (ఇండియా)
►ఎఫ్సీఐ ఆరావళి జిప్సమ్ అండ్ మినరల్స్ (ఇండియా)(ఎఫ్ఏజీఎమ్ఐఎల్)
అయితే ఈ ఐపీఓ, ఎఫ్పీఓలు ఈ ఆర్థిక సంవత్సరంలోనా, వచ్చే ఆర్థిక సంవత్సరంలోనా అనే విషయాన్ని రవి శంకర్ ప్రసాద్ వెల్లడించలేదు. మరోవైపు కేంద్ర ప్రభుత్వ సంస్థల లిస్టింగ్ అర్హత నిబంధనలను కేంద్రం మరింతగా విస్తరించింది. వరుసగా మూడు ఆర్థిక సంవత్సరాల్లో నికర లాభం సాధించిన సీపీఎస్యూలు స్టాక్ ఎక్సే్చంజ్ల్లో లిస్టింగ్కు అర్హత పొందుతాయని స్పష్టంచేసింది.