
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఓఎన్జీసీ కంపెనీ, అరేబియా సముద్రంలో భారీ ఆయిల్, గ్యాస్ నిక్షేపాలను కనుగొంది. అరేబియా సముద్రంలోని ముంబై హై చమురు క్షేత్రాల్లో ఓఎన్జీసీ ఈ నిక్షేపాలను కనుగొన్నట్లు చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ముంబై హై చమురు క్షేత్రంలో పశ్చిమ ప్రాంతంలో ఈ నిక్షేపాలను ఓఎన్జీసీ కనుగొన్నదని లోక్సభకు లిఖిత పూర్వకంగా వెల్లడించిన సమాధానంలో ప్రధాన్ పేర్కొన్నారు.
ఈ ఆవిష్కరణల్లో 29.74 మిలియన్ టన్నుల ఆయిల్, ఆయిల్ సమానమైన గ్యాస్ నిక్షేపాలున్నట్లు అంచనా వేస్తున్నారు. భారత ప్రధాన చమురు క్షేత్రమైన ముంబై హైలో రోజుకు 2,05,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతోంది. ఈ కొత్త నిక్షేపాలు కూడా జత అయితే ఈ ఉత్పత్తి మరింతగా పెరుగుతుంది. ముంబై హైలో ఓఎన్జీసీ గత 50 ఏళ్ల నుంచి ఉత్పత్తి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కొత్త నిక్షేపాల కారణంగా కంపెనీ ఉత్పత్తి గతంలో అంచనా వేసినదానికంటే దీర్ఘకాలం కొనసాగనున్నది.